ప్రచారానికి తెర: వేడి పెంచిన 'భువనేశ్వరి ఓటు', కెసిఆర్ రాజకీయ అసహనం!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. ఈ రోజు సాయంత్రం అయిదు గంటల తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఎన్నికల సంఘం హెచ్చరికలతో అన్ని పార్టీలు ప్రచారానికి ముగింపు పలికాయి.
పదిహేను రోజులుగా కొనసాగుతున్న ప్రచార పర్వానికి ఆదివారం చివరి రోజు కావడంతో ఆదివారం నగరంలోని అన్ని డివిజన్లలో ఆయా పార్టీలు బల ప్రదర్శన, మాటల దాడి చేశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తాము పోటీచేసే డివిజన్లలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
జిహెచ్ఎంసి ఎన్నికలకు మంగళవారం నాడు అంటే... ఫిబ్రవరి 2 పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 5న జరగనుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆదివారం నాడు వేడెక్కించాయి. మా వదిన (చంద్రబాబు సతీమణి) భువనేశ్వరి కూడా తెరాసకే ఓటు వేస్తానని చెప్పారని కెసిఆర్ చెప్పారు.
దీనిపై చంద్రబాబు సహా తెలంగాణ, ఏపీ టిడిపి నేతలు భగ్గుమన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. భువనేశ్వరి తమ పార్టీకే ఓటు వేస్తారని కెసిఆర్ చెప్పడం విడ్డూరమని ఏపీ మంత్రులు, నేతలు, తెలంగాణ టిడిపి నేతలు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొన్న తనను హైదరాబాదులో ఎలా ఉంటారని ప్రశ్నించారని, ఇప్పుడు తన సతీమణి భువనేశ్వరి తెరాసకు ఓటు వేస్తారని చెప్పారని, కెసిఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కెసిఆర్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... కెసిఆర్ చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదని, తన ఇంటికి ఇతర పార్టీల నేతలు వచ్చి ఓటు అడిగినా సరేనని చెబుతామని, కానీ వెళ్లగొట్టమని అన్నారు.