తెలంగాణ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థుల్లో భారీ మార్పులు.!కొత్త ముఖాల కోసం పార్టీల్లో మొదలైన వేట..!!
హైదరాబాద్ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత సిట్టింగ్ స్థానాల్లో చాలా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ లోని రాజకీయ పార్టీలు టార్గెట్లు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలో దిగుతున్నాయి. వీలైనన్ని ఎక్కువ ఎంపీలు స్థానాలు సాధిస్తే కేంద్రంలో రానున్న ప్రభుత్వంలో పలుకుబడి ఉంటుందని, తద్వారా కేంద్రంలో పెత్తనం చలాయించవచ్చని భావిస్తున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకుగానూ 16చోట్ల గెలుపే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యూహరచన చేస్తున్నారు. ఈ దశలో ఇప్పటికే ఉన్న ఎంపీల్లో ఎవరెరవరు పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న వారిలో వయోబారం, ఇతరత్రా రాజకీయ కారణాలతో పోటీ నుంచి తప్పుకునేవారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎంపీ బరిలో నిలిచేదెవరో, నిలవందెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
ఖాళీ ఐన పెద్దపల్లి, మల్కాజిగిరి స్థానాలు..! కొత్త వారి కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు..!!
తెలంగాణలో ఇప్పటికే రెండు ఎంపీ స్థానాలు ఖాళీ అయ్యాయి. పెద్దపల్లి, మల్కాజిగిరి స్థానాలు ఖాళీ అయ్యాయి. పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సీహెచ్ మల్లారెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వీరు రాజీనామా చేయడంతో లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ రాజీనామాలు ఆమోదించారు. దీంతో వీరిద్దరూ వచ్చే లోక్సభకు తిరిగి పోటీ చేసే అవకాశం లేదు.
నల్గొండ ఎంపీగా కేసీఆర్ పోటీ..? స్పష్టత రావాల్సి ఉందంటున్న పార్టీ శ్రేణులు..!!
ఇక నల్లొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్రెడ్డి తెరాసలో చేరడంతో ఆయనకు రైతు సమన్వయసమితి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరగుతోంది. మరోవైపు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కూడా కేబినెట్ హోదా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ లోక్సభ నుంచి పోటీ చేయడం లేదు. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా అభ్యర్థిత్వం మాత్రం ఖరారు కాలేదు.
సికింద్రబాద్ నై కన్నేసిన బీజేపి..! కానీ గెలిచేది మేమే అంటున్న గులాబీ పార్టీ..!!
ఇక సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున బండారు దత్తాత్రేయ గత ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. వయోభారం రీత్యా దత్తాత్రేయకు టికెట్ ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ అధిష్థానం నిర్ణయించింది. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ టికెట్ ఆశిస్తున్నారు. దత్తాత్రేయ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయమైంది.
కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యం..! ప్రత్యామ్నాయం ఉంటుందని భరోసా..!!
గత ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లో నాగర్కర్నూల్ ఒకటి. ఇక్కడి నుంచి నంది ఎల్లయ్య విజయం సాధించారు. ఈసారి ఆయన పోటీ చేయడం అనుమానంగా మారింది. ఆయనకు టికెట్ ఇవ్వరని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి మల్లు రవి పోటీకి సిద్ధమవుతున్నారు. నంది ఎల్లయ్య తిరిగి ఎన్నికల బరిలో నిలిచేది లేనట్టే. ఇక మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విషయంలో గులాబీ పార్టీ అధిష్ఠానం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. వారికి టికెట్ కేటాయించే విషయంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీబీ పాటిల్ సంగతి పక్కన పెడితే సీతారాంనాయక్కు బదులుగా వేరొకర్ని బరిలో దించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సీతారాంనాయక్ కూడా ఎన్నికల బరిలో నిలవడం సందేహంగా మారింది. దీంతో 17 ఎంపీ స్థానాల్లో చాలా వరకు కొత్త ముఖాలు రంగ ప్రవేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.