దొరల్లా బతుకుతారు.. దొంగతనాలు చేస్తారు.. వీళ్లెక్కడి మనుషులు రా నాయనా..!
హైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అంటారు. దొరకనంత కాలం ఏ దొంగైనా దొరలా బతుకుతాడని దానర్థం. పోలీసులకు దొరికితే చాలు ఆ దొంగ గుట్టు బయట పడుతుంది. ఇదే కోవలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన దొంగల తీరు చూస్తే ఔరా అనాల్సిందే. సొంత రాష్ట్రంలో పెద్ద మనుషుల్లా చలామణీ అవుతూ.. ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. అక్కడ బిల్డప్ ఇస్తూ వేరే రాష్ట్రాల్లో చోరీలు చేస్తున్న నలుగురు దొంగలు సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కారు. అదలావుంటే ఫిబ్రవరి నెలలో కూడా ఇలాంటి దొంగ ఖాకీలకు అడ్డంగా దొరికాడు. బుల్లెట్ బైక్, చేతివేళ్లకు ఉంగరాలు, ఖద్దరు చొక్కా.. ఇలా ఏమాత్రం తగ్గని ఓ లీడర్ చోరీలు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఓ టిక్టాక్ స్టార్ పరిస్థితి కూడా అంతే.
సింగిల్ గా వచ్చి కూల్ గా దోచేసే దొంగ పై పీడీ యాక్ట్
సొంత రాష్ట్రాల్లో పెద్ద మనుషులు.. ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలు
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా తమ ఏరియాల్లో వ్యాపారాలు చేస్తూ పెద్దమనుషులుగా చలామణీ అవుతున్నారు. సంవత్సరంలో పదకొండు నెలల పాటు వ్యాపారాలు చూసుకుంటూ ఒక నెల మాత్రం దొంగతనాలకు కేటాయిస్తున్నారు. సొంత రాష్ట్రాల్లో చోరీలు చేయకుండా ఇతర రాష్ట్రాలపై కన్నేస్తుండటంతో వీరి ఉనికి ఇన్నాళ్లు బయటపడలేదు.
క్యా బాత్ హై.. ఐదేళ్లుగా ఇదే తంతు
ఐదు సంవత్సరాలుగా వీరిది ఇదే తంతు. అయినా కూడా ఎక్కడ కూడా పోలీసులకు చిక్కిన దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల్లో చోరీలకు ప్లాన్ చేసే ఈ ముఠా ఆయా ప్రాంతాల్లో ఖరీదైన హోటళ్లలో బస చేస్తుంటారు. కార్లలో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవారు. ఇన్నాళ్లు పెద్దమనుషుల ముసుగులో చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యుల గుట్టు రట్టు చేశారు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలుచోట్ల చోరీలకు పాల్పడిన వీరి నుంచి 60 తులాల బంగారం, రెండు కిలోల వెండి, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు.
ఫిబ్రవరిలో పోలీసులకు చిక్కిన లీడర్ దొంగ
ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో సైబరాబాద్ పోలీసులకు ఇలాగే ఓ వింత దొంగ దొరికాడు. బుల్లెట్ బైక్, చేతివేళ్లకు ఉంగరాలు, ఖద్దరు చొక్కా.. ఇలా ఏమాత్రం తగ్గని ఓ లీడర్ చోరీలు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా బెలుర్గికి చెందిన కాశీనాథ్ గైక్వాడ్ అలియాస్ కాశప్ప స్థానికంగా రైతు సంఘం అధ్యక్షుడు. అంతేకాదు సొంత గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతున్నాడు. కర్ణాటక అధికార పార్టీ జేడీఎస్ లో ఆయన ప్రాంతానికి క్రీయాశీలక నేతగా వ్యవహరిస్తున్నాడు.
అక్కడ లీడర్.. హైదరాబాద్లో చోరీలు
రాజకీయ పలుకుబడి మెండుగా ఉన్న కాశప్ప మండలంలో లీడర్ గా గుర్తింపు పొందాడు. అయితే పేకాట వ్యసనం అతడిని ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. దీంతో చోరీల బాటను ఎంచుకున్నాడు. దొంగతనాలు చేయడానికి డిసైడ్ అయిన కాశప్ప సొంత రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రంపై కన్నేశాడు. కర్ణాటకలో ఐతే పోలీసులకు తొందరగా దొరికిపోతాననే భయంతో తెలంగాణలోని హైదరాబాద్ పై నజర్ పెట్టాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి సమయాల్లో చోరీలు చేసేవాడు. 16 చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న కాశప్ప ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు దొరికిపోయాడు
ఓ టిక్టాక్ స్టార్ కూడా దొంగనే
అదలావుంటే ఉత్తరప్రదేశ్లో ఓ టిక్టాక్ స్టార్ చోరీల బాట పట్టాడు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా లోని గ్రేటర్ నోయిడాలో వరుస చోరీలు జరుగుతుండటం పోలీసులకు సవాల్గా మారింది. ఏ కోణంలో చూసినా నిందితుల ఆచూకీ దొరక్కపోవడం పోలీసులకు తలనొప్పైంది. దాంతో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. దాంతో టిక్ టాక్ స్టార్ నేతృత్వంలోని దొంగల ముఠా గుట్టు రట్టైంది.
దొంగల ముఠాకు నాయకుడిగా
టిక్ టాక్ స్టార్గా షారూఖ్ అనే యువకుడు చాలా ఫేమస్ అయ్యాడు. తనకు టిక్ టాక్ యాప్లో దాదాపు 40 వేల మంది వరకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అతడు చేసే డ్యాన్సులను ఆ యాప్లో అప్లోడ్ చేస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే స్టార్డమ్ ఉంది కదా.. తాను ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడో ఏమో గానీ మొత్తానికి చోరీల బాట పట్టాడు. దొంగల ముఠాకు నాయకత్వం వహించి బాగానే దోచినట్లు స్థానిక పోలీసుల ద్వారా బయట పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో అతడిని అరెస్ట్ చేశారు.