పన్నుఎగవేతకు 'సాగు': వ్యవసాయ కోటీశ్వరులపై దర్యాఫ్తు, ఏడో స్థానంలో హైద్రాబాద్
న్యూఢిల్లీ/హైదరాబాద్: పన్ను వేయదగిన ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపిస్తున్న వారిలో చాలామంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారని, వారి పైన దర్యాఫ్తు జరుగుతోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం నాడు రాజ్యసభలో తెలిపారు. అయితే రైతుల పైన పన్ను వేసే ఉద్దేశ్యం లేదని ఆయన చెప్పారు.
దేశంలో చాలామంది పెద్ద మనుషులు ప్రభుత్వ పన్నులను తప్పించుకోవడానికి తమ ఆదాయాన్ని వ్యవసాయ అనుబంధ ఆదాయంగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు.
ఆ పెద్ద మనుషుల పేర్లు బయటకు వస్తే ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అని ఆరోపించవద్దని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఆదాయ పన్ను చట్టాలను ఎవరు ఉల్లంఘించినా వారి పైన ఆదాయపన్ను శాఖ విచారణ సాగుతుందని చెప్పారు.
దేశంలో సాగు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే యోచన ప్రభుత్వానికి లేదని అరుణ్ జైట్లీ చెప్పారు. కాగా, మన దేశంలో వ్యవసాయం రాబడికి ఆదాయ పన్ను శాఖ నుంచి మినహాయింపు ఉంది.
అంతకుముందు, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులను ఎగవేసేందుకు పెద్ద మొత్తంలో నల్లధనాన్ని వ్యవసాయ సంబంధ ఆదాయంగా చూపించే కుట్ర జరుగుతోందని జెడియూ, ఎస్పీ, బిఎస్పీ సభ్యులు రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. దీనిపై మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పారు.
ఆదాయపన్ను శాఖ తన పని తాను చేస్తుందని చెప్పారు. అయితే సభను అరుణ్ జైట్లీ తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. తమను బెదిరించడం మాని పన్ను ఎగవేతదారుల పేర్లు బయటపెట్టాలన్నారు.
అంతకుముందు జేడీయు సభ్యుడు శరద్ యాదవ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. 2వేల లక్షల కోట్ల ఆదాయాన్ని వ్యవసాయ అనుబంధ ఆదాయంగా చూపించారనే ఆరోపణలు వస్తున్నాయని, దీని పైన ప్రభుత్వం వివరణ ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై సర్కార్ సమాధానం చెప్పాలని మాయావతి పట్టుబట్టారు.
2008-09 నుంచి 2015-16 మధ్య రూ.కోటికి పైగా వ్యవసాయా ఆదాయాన్ని చూపిన వారు వేలాది మంది ఉన్నారని తెలుస్తోంది. గత తొమ్మిదేళ్లలో రూ.కోటికి పైగా వ్యవసాయ ఆదాయాన్ని ప్రకటించిన ఉదంతాలు మొత్తంగా రెండువేల ఏడు వందలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
రూ.కోటికి పైగా ఆస్తులను ప్రకటించిన వారి లిస్ట్ ఆధారంగా టాప్ టెన్ నగరాల్లో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ 162 మందితో ఏడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో బెంగళూరు (321) ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, కోల్కతా, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, కొచ్చి, కోయంబత్తూరు ఉన్నాయి.