ఓటు హక్కు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కి ఊరట
న్యూఢిల్లీ/హైదరాబాద్: పౌరసత్వానికి సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో వేములవాడ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భారతీయ జనతా పార్టీ నేత ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
ఎన్నికల అధికారి ఎమ్మెల్యేగా రమేశ్బాబు తన ఎమ్మెల్సీ ఓటు హక్కును నియోగించుకోవచ్చని లిఖిత పూర్వకంగా అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చిన ఆధారాలను చెన్నమనేని సుప్రీంకోర్టుకు సమర్పించడంతో ఆది శ్రీనివాస్ వేసిన పిటీషన్ కొట్టి వేసినట్లు సమాచారం.
ద్వంద్వ పౌరసత్వం వ్యవహారంలో దాఖలైన పిటిషన్ విచారణలో ఉన్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నా, ఆయన ఓటు వేశారని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని ఆది శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెన్నమనేని ఓటు వేశారంటూ భారతీయ జనతా పార్టీ నేత ఆది శ్రీనివాస్ వేసిన వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ కురియన్, జస్టిస్ నారిమన్లు విచారణ చేపట్టారు.
చెన్నమనేని రమేష్కి ద్వంద్వ పౌరసత్వం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు షరతులతో కూడిన స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే, ఆ స్టే 2009 ఎన్నికల్లో ఎంపికైన కాలానికే పరిమితమని అభిప్రాయపడిన ధర్మాసనం.. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రమేశ్ ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని సమర్థిస్తూ కేసు కొట్టివేసింది. కాగా, ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన వ్యాజ్యం విచారణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.