కటక్లో రూ. 12 కోట్ల భారీ దోపిడీ: హైదరాబాద్ సీపీకి ఒడిశా డీజీపీ ఫోన్, కేసు క్లోజ్ చేశారిలా..
హైదరాబాద్: అత్యంత కీలకమైన కేసులను కూడా తెలంగాణ పోలీసులు ఎంతో సమర్థత, చాకచక్యంతో చేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల పోలీసు విభాగంవారు కూడా తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ పోలీసుల సాయాన్ని కోరుతున్నారు. ఇటీవల ఒడిశాలో జరిగిన భారీ దోపిడీని తెలంగాణ పోలీసులు ఛేధించడం గమనార్హం.
ఒడిశా డీజీపీ ఫోన్..
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో సీపీ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. సాంకేతికతో ఎంతో ముందున్న హైదరాబాద్ పోలీసులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని కొలిక్కిరాని కేసులను కూడా ఛేదిస్తున్నారని సీపీ తెలిపారు. ఒడిశా రాష్ట్రం కటక్లోని ఐఐఎఫ్ఎల్ సంస్థలో జరిగిన 12 కోట్ల విలువైన బంగారం, నగదు దోపిడీ కేసు పరిష్కారంలో తమకు సహకరించాలని ఆ రాష్ట్ర డీజీపీ తనను కోరారని తెలిపారు.
12 కిలోల బంగారం చోరీ..
ఈ క్రమంలో తాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంను ఒడిశాకు పంపానని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఒడిశాలోని కటక్లో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్(ఐఐఎఫ్ఎల్) సంస్థలో నవంబర్ 19న భారీ దోపీడీ జరిగింది. పట్టపగలే ఈ సంస్థపై దాడి చేసిన దుండగులు మారణాయుధాలతో బెదిరించి 12 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరించారు. ద్విచక్ర వాహనాలపైనే వచ్చి ఈ దోపిడీకి పాల్పడి పారిపోయారు.
కటక్కు తెలంగాణ టాస్క్ఫోర్స్ పోలీసులు
అయితే, ఒడిశా పోలీసులు మాత్రం దోపిడీ జరిగి 24 గంటలు గడిచినా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. దీంతో ఒడిశా డీజీపీ అభయ్.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ను సంప్రదించారు. ఈ దోపిడీ కేసు దర్యాప్తులో ఒడిశా పోలీసులకు సహకరించాలని కోరారు. వెంటనే స్పందించిన సీపీ.. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా.. టాస్క్ఫోర్స్ ఓఎస్డీ పీ రాధా కిషన్ రావును ఆదేశించారు. దీంతో ఇప్పటికే పలు కీలక కేసుల్ని ఛేదించిన అనుభవం ఉన్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందానికి చెందిన సబ్ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ ఈశ్వర్లను ఓఎస్డీ కటక్కు పంపించారు.
కేసు క్లోజ్ చేసిన తెలంగాణ పోలీసులు
వెళ్లిన వెంటనే పని ప్రారంభించిన శ్రీకాంత్, ఈశ్వర్లు .. దోపిడీ జరిగిన ప్రాంతంలో వివిధ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సాంకేతిక ఆధారాలను పరిశీలించి అనుమానితుల్ని గుర్తించారు. ఈ ద్వయం ఇచ్చిన కీలక ఆధారాలతో ముందుకెళ్లిన కటక్ పోలీసులు.. నవంబర్ 24న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సంస్థలోని ఉద్యోగుల ప్రమేయం ఉందని తేల్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు ఒడిశా డీజీపీ అభయ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.