ముత్తూట్ ఫైనాన్స్లో భారీ దోపిడీ: 46కిలోల గోల్డ్ అపహరణ, ఉగ్ర కుట్రేనా?
సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో భారీ దోపిడీ జరిగింది. రూ. 10కోట్ల విలువైన నగలు, నగదును దుండగులు దోచుకెళ్లారు.
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో భారీ దోపిడీ జరిగింది. రూ. 12కోట్ల విలువైన నగలు, నగదును దుండగులు దోచుకెళ్లారు. మారణాయుధాలతో బెదిరింపులకు గురిచేసిన దుండగులు.. ఈ దోపిడీకి పాల్పడ్డారు.
రెడ్ స్కార్పియోలో వచ్చిన ఐదుగురు దుండగులు.. మొదట తాము సీబీఐ అధికారులమని చెప్పుకున్నారు. కార్యాలయం రికార్డులు పరిశీలించాలని.. లాకర్లలో ఉన్న బంగారాన్ని తనిఖీ చేయాలని సిబ్బందిని అడిగారు. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తాము లాకర్లను చూపించలేమని సిబ్బంది అనడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐ అధికారులను పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అనడంతో సిబ్బంది లాకర్లను చూపించారు. లోనికి వెళ్లిన వారు లాకర్లు తెరిచి బంగారాన్ని సంచుల్లో వేసుకుంటుండటాన్ని సిబ్బంది గమనించి ప్రశ్నించారు. దీంతో మారణాయుధాలు చూపించిసెక్యూరిటీ సిబ్బందిని బెదరించారు. సెక్యూరిటీ సిబ్బందిని ఓ గదిలో బంధించి లాకర్లలోని 46కిలోల బంగారాన్ని అపహరించుకుపోయారు.
అంతేగాక, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఫుటేజీని కూడా తమ వెంట తీసుకెళ్లారు. బుధవారం ఉదయం 9నుంచి 10గంటల సమయంలో ఈ దోపిడీకి తెగబడ్డారు దుండగులు. ఘటనపై ముత్తూట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేబట్టారు.
కాగా, మూడేళ్ల క్రితం గత కొద్ది రోజుల క్రితం కూడా నలుగురు ఉగ్రవాదులు ఇదే ముత్తూట్ శాఖలో దోపిడీకి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాండ్వా జైలు నుంచి పారిపోయిన ఉగ్రవాదులే ఈ దోపిడీకి పాల్పడ్డారు. అయితే, ఈ ఉగ్రవాదులు నల్గొండ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు. తాజాగా మరోసారి ఇదే శాఖలో దోపిడీ జరగడంతో మళ్లీ ఉగ్రవాదులే ఈ దోపిడీకి పాల్పడ్డారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
విస్తృత గాలింపు
శాఖ సిబ్బందిని విచారించి దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించామని, నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. జహీరాబాద్తో పాటు తెలంగాణ-కర్ణాటక సరిహద్దు కూడలి గంగ్వార్ వద్ద అంతర్రాష్ట్ర రాకపోకలు సాగిస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్-ముంబై, బీదర్-జహీరాబాద్ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ డీఎస్పీ నల్లమల రవి తెలిపారు.