ఎంపీ ఇంట్లో భారీ చోరీ: రూ.15లక్షల సొత్తు అపహరణ, సీసీ ఫుటేజీ ధ్వంసం
టీఆర్ఎస్ ఎంపీ నగేష్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరగడం గమనార్హం.
ఆదిలాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నగేష్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరగడం గమనార్హం.
ఎంపీ నివాసంలో ఎవరూ లేని విషయం గమనించిన దొంగలు.. మొదట ఇంటి ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఇంటి తాళాలను పగుల గొట్టి లోపలికి వెళ్లారు.
బీరువాలో దాచి వుంచిన రూ.71,000 నగదు, పలు బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నగదు, ఆభరణాలు కలిపి మొత్తం రూ.15 లక్షల విలువ ఉన్నట్లు ఎంపీ బంధువులు పట్టణ 1వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎంపీ ఇంట్లో దొంగతనం జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఆగస్టు 28న దొంగతనం జరిగిన అనంతరం ఎంపీ ఇంటి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని బంధువులు తెలిపారు. కాగా, ఆదిలాబాద్ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. క్లూస్ టీంతో వచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.