కేసీఆర్ కు పెద్ద షాక్ : ఒకటనుకుంటే మరొకటి జరగవట్టే..!
హైదరాబాద్ : తానొక్కటి తలిస్తే దైవమొక్కటి తలచినట్లు తయారయింది తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి. ఇదివరకు కొన్ని సందర్భాల్లో హైకోర్టులో చుక్కెదురయిన గులాబీ బాస్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కేసీఆర్ ఏ వేదికను ఉపయోగించుకుని ఉద్యమంలో రాటుదేలినారో ఆ వేదికపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చానీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ తాజా హైకోర్టు తీర్పును ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఎన్నికల వేడి : ఆ నలుగురు రాజీనామా.. అసలేం జరిగింది
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్. అధికారిక నిరసనల వేదిక. తెలంగాణలో ఏ బిడ్డను అడిగినా పక్కా అడ్రస్ చెబుతారు. తెలంగాణ ఉద్యమానికి, వివిధ ఆందోళనకు వేదికగా నిలిచిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎత్తివేశారు. అక్కడ ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా చర్యలు తీసుకున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు, హక్కుల పోరాటానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తివేయడం చాలామందికి నచ్చక న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు అప్పట్లో హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కొనసాగించాలంటూ తాజాగా మధ్యంతర తీర్పు వెలువరించింది.
ఆందోళనల అడ్డా.. ఇందిరా పార్క్ ధర్నా చౌక్
ఎవరికి ఏ కష్టమొచ్చినా పాలకులకు ప్రజల గొంతుక వినిపించేలా ఆశ్రయమిచ్చింది ఇందిరా పార్క్ ధర్నా చౌక్. అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ సైతం ఎన్నోసార్లు ఇదేచోట ధర్నాల్లో పాల్గొన్నారు. ఉద్యమ నినాదాలు ఢిల్లీ పాలకులకు వినిపించేలా ఇదే ధర్నా చౌక్ ను అస్త్రంగా వాడుకున్నారు. ఒకటి కాదు రెండుకాదు వందల సార్లు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా గులాబీ నేతలు నిరసనలు చేపట్టారు.
అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ మాయం
2014లో రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అప్పట్లో ఈ అంశంపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ధర్నా చౌక్ ఎందుకు ఎత్తివేశారంటూ ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు లేకుండా చేసేందుకే ధర్నా చౌక్ ఎత్తివేశారంటూ ఆందోళనలకు దిగారు. ప్రజల గొంతు నొక్కేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ.. ధర్నా చౌక్ పరిరక్షణ కోసం పార్టీలకతీతంగా నేతలు పోరాడారు. చివరకు న్యాయ పోరాటానికి సైతం సిద్ధమయ్యారు.
హైకోర్టులో వీహెచ్ పిటిషన్.. ధర్నా చౌక్ పునరుద్ధరణ
ధర్నా చౌక్ ఎత్తివేసి టీఆర్ఎస్ ప్రజల గొంతును నొక్కేసిందని ఆరోపిస్తూ అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నా చౌక్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 వారాల వరకు ధర్నా చౌక్ ను యధావిధిగా కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6 వారాల తర్వాత అన్నీ అంశాలు పరిగణనలోకి తీసుకుని తదుపరి నిర్ణయం వెలువరిస్తామని తెలిపింది. ధర్నా చౌక్ ను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించేంది లేదన్న కేసీఆర్ కు తాజా హైకోర్టు తీర్పు పెద్ద షాక్.
హైకోర్టులో ఎన్నో ఎదురుదెబ్బలు..!
టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై హైకోర్టులో చుక్కెదురయిన సందర్భాలున్నాయి. దాదాపు 30కి పైగా వివిధ అంశాల్లో న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తప్పలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఫాస్ట్ పథకం, పంచాయతీ ఎన్నికలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయం ఇలా చాలా అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది.