టీజేఎస్ కు భారీ షాక్.. వైస్ ప్రెసిడెంట్ రచనా రెడ్డి గుడ్ బై.. ఓడిపోవడానికే కూటమి కట్టారా?
హైదరాబాద్ : ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేతల మాటాల తూటాలు ఒకవైపు పేలుతుంటే.. మరోవైపు కండువాలు మార్చేస్తున్నారు కొందరు. ఇది ఆయా పార్టీల స్ట్రాటజీయా? అసలు ఏం జరుగుతోందనే విషయం తెలియక మల్లగుల్లాలు పడుతున్నాడు సామాన్యుడు.
టీఆర్ఎస్ పార్టీ విధానాలు వ్యతిరేకిస్తూ ఏర్పాటైన తెలంగాణ జన సమితికి ఆది నుంచి కష్టాలే. తాజాగా మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, లాయర్ రచనారెడ్డి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. టీజేఎస్ విధానాలు నచ్చక తాను బయటకు వచ్చానంటూ మీడియాకు తెలిపారు.
ఎందుకు రాజీనామా? అసలేం జరిగింది?
తెలంగాణ జన సమితికి పెద్ద షాక్ తగిలింది. పార్టీ ఉపాధ్యక్షురాలు రచనారెడ్డి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. అంతేకాదు ఆమె రాజీనామా చేశాక పార్టీ అధ్యక్షులు కోదండరాం చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. కోదండరాం పై తీవ్ర ఆరోపణలు చేసిన రచనారెడ్డి.. "ప్రజాకూటమి ఫిక్సింగ్" అంటూ మండిపడ్డారు. ప్రజాకూటమిలో సామాజిక న్యాయం జరిగిందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ తో చేతులు కలిపిన కోదండరాం తనకు తానే ఓటమి చెందుతున్నారని చెప్పుకొచ్చారు. అసలు కూటమి గెలవడానికా? ఓడిపోవడానికా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కోదండరాంపై నిప్పులు
తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాంపై గరమయ్యారు రచనారెడ్డి. ప్రజాకూటమంటూ కాంగ్రెస్ తో పొత్తు కూడిన కోదండరాంను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేని టీజేఎస్ లో సామాజిక న్యాయం ఎలా జరుగుతుందని మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్లిచ్చిన భాగోతంలో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు.
ప్రజాకూటమిలో ఎవరికి న్యాయం జరగదని.. చాలామంది నేతల్ని బలిపశువులుగా చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా ముందుకొచ్చిన కూటమిలో కూర్పు సరిగా లేదని ఆరోపించారు. ఇక నేతలంతా పొలిటికల్ బ్రోకర్లుగా తయారయ్యారని ధ్వజమెత్తారు. అటు చంద్రబాబు నాయుడిపై కూడా సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని, చంద్రబాబు ప్రచారాన్ని తిప్పికొడతారని అభిప్రాయపడ్డారు.
రాజకీయం.. అంతా అయోమయం
తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించిన కోదండరాం.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక మెల్లిమెల్లిగా ఆ పార్టీనేతలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో టీఆర్ఎస్ పాలన తీరుపై ఆరోపణలు కూడా గుప్పించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అన్నట్లు తెలంగాణ జన సమితి పార్టీ స్థాపించారు. కొన్ని కారణాలతో ఒంటరిగా పోటీచేయలేని పరిస్థితి కోదండరాం పార్టీది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ లతో పాటు తన పార్టీని కూడా చేర్చి ప్రజాకూటమిగా ఎన్నికల బరిలోకి వచ్చారు. టికెట్ల విషయంలో గానీ, నేతల మధ్య పొసగకపోవడం గానీ.. ఇలా చాలాసార్లు టీజేఎస్ అడపాదడపా వార్తల్లోకెక్కింది. తాజాగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ రచనారెడ్డి రాజీనామా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల సమయం దగ్గరపడ్డ తరుణంలో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అసలు టీజేఎస్ పార్టీలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.