గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్: రేపు ఢిల్లీలో బీజేపీ గూటికి విజయశాంతి
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న, పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన నేత అయిన విజయశాంతి పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి, మంగళవారం బీజేపీ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
గ్రేటర్ లో ప్రలోభాల పర్వం .. గంపగుత్తగా ఓట్ల కోసం.. రహస్య సమావేశాలు, తాయిలాలు
కాంగ్రెస్ పార్టీ నేతలపై విజయశాంతి అసహనం .. అందుకే బీజేపీ గూటికి
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి గాంధీ భవన్ వైపు కూడా చూడటం లేదు. టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం కీలకంగా ఆమె వ్యవహరించటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బిజెపిలో కీలక భూమిక పోషించటానికి విజయశాంతి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం.
రెండు దశాబ్దాల తర్వాత సొంత గూటికి చేరుతున్న విజయశాంతి
రెండు దశాబ్దాల తర్వాత విజయశాంతి సొంత గూటికి చేరి, బిజెపి తరఫున గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి తో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయశాంతి ఆమె అనుచరులతో సమాలోచనలు జరిపి బిజెపిలో చేరారని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు, నేతల తీరుపై చాలాకాలంగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు . ఈ క్రమంలో ఆమె బీజేపీ బాట పట్టారు.
బీజేపీలోనూ విజయశాంతికి కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించిన విజయశాంతికి బీజేపీలో చేరిన అనంతరం కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టినా విజయశాంతి ఇప్పటివరకు ప్రచార రంగంలోకి దిగకుండా పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చింది. రేపు ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరి బిజెపి తరఫున ప్రచార పర్వాన్ని విజయశాంతి కొనసాగించనున్నట్లు గా సమాచారం.
Recommended Video
మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా కాంగ్రెస్ పరిస్థితి
ఏది ఏమైనా మొన్న దుబ్బాక ఎన్నికలలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి, గ్రేటర్ ఈ ఎన్నికలలో పార్టీని వీడి కీలక నేతలు వెళ్ళిపోతున్న పరిణామాలు , ఇక స్టార్ క్యాంపెయినర్ అయిన విజయశాంతి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పటం ఆందోళన కలిగిస్తుంది . తాజాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ ఎన్నికలలోనూ కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుందా అన్న అనుమానాలకు కారణమవుతోంది.మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు తాజాగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది .