తెలంగాణలో దయాకర్ రికార్డ్, ఎల్లుండి ప్రమాణం: కెసిఆర్ హావభావాలు (పిక్చర్స్)
వరంగల్/హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ ఫలితం తమ బాధ్యతను మరింత పెంచిందని, ఇంకా విజృంభించి పని చేస్తామని కెసిఆర్ అన్నారు.
జనవరి తర్వాత జిల్లాల్లో బస్సు యాత్ర చేస్తామని, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. మహిళా సంఘాలకు త్వరలో తీపికబురు ఉంటుందన్నారు. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పైన 4,59,092 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇది టిఆర్ఎస్లో మరింత ఉత్సాహం పెంచింది.
కాగా, వరంగల్ నుంచి గెలిచిన పసునూరి దయాకర్ ఎల్లుండి (శుక్రవారం) నాడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. బుధవారం ఉదయం ఆయన వరంగల్ జిల్లా నేతలతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కెసిఆర్
టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించారని, వరంగల్ ఉప ఎన్నికల్లో ఇది సుస్పష్టమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారని కితాబునిచ్చారు. ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్ దక్కకుండా చేసి బుద్ధి చెప్పారన్నారు.
కెసిఆర్
గతంలో లేనివిధంగా తెరాసను ప్రజలు భారీ ఆధిక్యంతో గెలిపించారని ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే విధమైన ఫలితం వస్తుందని, 80కిపైగా డివిజన్లను టిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కెసిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు పునర్నిర్మాణానికి పునాది వేసే బాధ్యత మాపై పెట్టారని, తెలంగాణలో నీటిపారుదల రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్, టిడిపి హయాంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు అంతరాష్ట్ర వివాదాల్లో కూరుకుపోయాయన్నారు. అందుకే ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నామన్నారు.
కెసిఆర్
ఆరు నెలలు ఆలస్యమైనప్పటికీ పొరపాట్లు లేకుండా చేస్తామని, ప్రాణహిత ప్రాజెక్టుకు రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిననాడే ఇది గోల్మాల్ ప్రాజెక్టు అని చెప్పానని, సాంకేతికంగా కూడా సాధ్యం కాదన్నారు. అందుకే దీనిని పూర్తిస్థాయిలో రీడిజైన్ చేశామని, కాళేశ్వరం వద్ద 16 టీఎంసీల నీళ్లు 365 రోజులపాటు నిల్వ ఉంటాయని లైడార్ సర్వేలో తేలిందన్నారు. దీనివల్ల ముంపు సమస్య కూడా తక్కువ అన్నారు.
కెసిఆర్
ఖమ్మం జిల్లాలో రాజీవ్-ఇందిరాసాగర్లను కలుపుతామని, లోయర్ పెన్గంగపై మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నామని, దీని సమస్య కూడా పరిష్కారమైనట్లేనన్నారు. వీటికి త్వరలోనే శంఖుస్థాపన చేస్తామన్నారు. 2021 నాటికి కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు.
కెసిఆర్
ప్రతిపక్షాలకు అసహన వైఖరి మంచిది కాదని, మహాకూటమి ఓ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అయిదు రోజులు కూడా గడవక ముందే రైతు రుణమాఫీపై మేం అననిది అన్నట్లుగా ప్రచారం చేసి తన దిష్టిబొమ్మ కాల్చారన్నారు. శాసనసభ సమావేశాల్లోనూ అసహనం, తొందరపాటుతనం, ఓర్వలేనితనంతో ఇష్టమున్నట్లుగా వ్యవహరించారన్నారు. ఇది మంచిది కాదన్నారు.
కెసిఆర్
వ్యక్తిగత నిందారోపణలు, నీచాతి నీచంగా ప్రతిపక్షాలు మాట్లాడడంతోనే వారికి ప్రజలు బుద్ధి చెప్పారని, కనీసం ధరావతు కూడా దక్కకుండా చేశారన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టుల రీడిజైన్పై వివాదాలు సృష్టించే ప్రయత్నం చేశాయని, రూ.250కోట్లతో కళాభారతి నిర్మాణం, సచివాలయం, ఛాతీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రుల తరలింపు పైనా అలాగే చేశారన్నారు.
కెసిఆర్
మిషన్ కాకతీయ పనులను ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చుకుంటే ప్రతిపక్షాలు దీన్ని 'కమీషన్ కాకతీయ' అంటూ ఎద్దేవా చేశారని, బోనాలు, బతుకమ్మ పండుగకు నిధులు ఇస్తే 'నీ బిడ్డకు ఇచ్చుకున్నావ'ని అన్నారని, నా బిడ్డ ఒక్కరే బతుకమ్మ ఆడుతుందా? తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆడే పండుగ అది అన్నారు.
కెసిఆర్
ప్రతిపక్ష నేత జానారెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా... ప్రాజెక్టులు చెప్పిన సమయంలో పూర్తిచేస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పారని, ఆయన గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలని చురక వేశారు. అభివృద్ధికి సంబంధించి కీలకమైన ప్రణాళికలను వంద శాతం పూర్తిచేశామన్నారు. జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఎన్నికలు, శాసనసభ సమావేశాలను జనవరి 30వ తేదీలోపు పూర్తిచేస్తామని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. బస్సు యాత్ర చేపడుతానన్నారు.
సంబరాలు
వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పొంగిపొర్లింది.
సంబరాలు
టిఆర్ఎస్ వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించింది. ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా రానంతగా ఓట్ల వేటలో శరవేగంగా దూసుకుపోయింది. 2014 ఎన్నికల్లో కంటే ఘనమైన ఫలితాలతో వరంగల్ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకుంది. గట్టిపోటీ ఇవ్వొచ్చని భావించిన కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది.
సంబరాలు
టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఎవరూ ఊహించనంత భారీ మెజారిటీతో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్, బిజెపి, వైసిపి అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
సంబరాలు
వరంగల్ ఎనమాముల మార్కెట్ కేంద్రంలో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో పసునూరికి మొత్తం 6,15,403 ఓట్లు దక్కాయి. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ కంటే ఆయన 4,59,092 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణలో పార్లమెంటరీ ఎన్నికల్లో ఇదొక కొత్త రికార్డు.
సంబరాలు
2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ నుంచి ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పోటీ చేసినప్పుడు 3,92,573 ఓట్ల మెజారిటీ దక్కింది. దాన్ని ప్రస్తుతం దయాకర్ అధిగమించారు.
సంబరాలు
కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,311 ఓట్లు పొంది రెండో స్థానంలో నిలిచారు. బిజెపి అభ్యర్థి పగిడిపాటి దేవయ్య 1,30,178 ఓట్లు సాధించి మూడో స్థానంలో ఉన్నారు.
సంబరాలు
ఈ రెండు పార్టీలకూ డిపాజిట్లు దక్కలేదు. వైసిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి గాలి వినోద్ కుమార్లూ డిపాజిట్లు కోల్పోయారు.
సంబరాలు
ఈ ఎన్నికలో మొత్తం 10,35,656 మంది ఓట్లు వేశారు. ఇందులో 1/6వ వంతు ఓట్లు వస్తేనే డిపాజిట్ దక్కినట్లు. అంటే 1,72,610 ఓట్లు రావాలి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఈ మైలురాయిని దాటలేకపోయారు.