మళ్లీ: సాగర్ తీరంలో 100 అంతస్థుల సౌధం, గవర్నర్తో కెసిఆర్ రెండున్నర గంటలు
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్ తీరంలో అరవై నుంచి వంద అంతస్థుల భారీ భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు ఆదేశించారు. అనువైన స్థలాన్ని ఎంపిక చేసి, ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు.
గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్ష జరిపారు. పురపాలక, రెవెన్యూ, తదితర శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. మలేసియా తదితర దేశాల్లో మాదిరిగా ఇక్కడ భారీ సౌధం నిర్మించాలని దాదాపు ఏడాది క్రితం ప్రభుత్వం భావించింది.
తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. సాగర్ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించి, భారీ సౌధం నిర్మించేందుకు అవసరమైన దానిని ఎంపిక చేయాలని సూచించారు.
గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారని సమాచారం.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తీరు, తదితరాలను గవర్నర్ నరసింహన్కు సీఎం కేసీఆర్ వివరించారని తెలుస్తున్నది. వరంగల్ జిల్లా తాడ్వాయిలో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా వివిధ సంఘాల ఆందోళన కూడా ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. అలాగే, రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పైన గవర్నర్తో చర్చించారని సమాచారం.