త్వరలో టీఆర్ఎస్ లో అతి పెద్ద సునామీ ... ఎందుకంటే ?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు టిఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కానీ త్వరలో టిఆర్ఎస్ పార్టీలో అతిపెద్ద సునామీ రాబోతుందని విహెచ్ చెప్పారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయిన విహెచ్ కేటీఆర్ సీఎం అయితే టీఆర్ఎస్లోనే ముసలం వస్తుందని షాకింగ్ కామెంట్ చేశారు . రానున్న రోజుల్లో గులాబీ పార్టీ కనుమరుగవడం ఖాయమని ఆయన అన్నారు.
అప్పుడు ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల తో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతారన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటూ తనకు తప్పక ఫోన్ చేస్తారు అని ఆయన చెప్పారు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో చేరే ముందు ఉన్న మర్యాద తర్వాత ఉండదని వీహెచ్ పేర్కొన్నారు.
నెల రోజుల్లో ఐదుగురు ఔట్: దేనికైనా రెడీ.. హరిప్రియ, సబిత నో... జానా సహా అందరూ ఆశ్చర్యం
టిఆర్ఎస్ లో చేరే ముందు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతారు అని, ఆ తర్వాత రిటర్న్ కార్పెట్ పరుస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి జంప్ అయిన, అవుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు.
అధికార పార్టీలో చేరాక సీఎం కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని, కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ టిఆర్ఎస్ పార్టీలో అసలే ఉండదని ఆయన అన్నారు. డబ్బు సంచులు, పదవుల కోసం పార్టీ మారుతూ అందుకు నాయకత్వ లోపం అంటూ టీపీసీసీ నాయకత్వాన్ని అవమానిస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఇక టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మామలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసి ఎప్పటిలానే విహెచ్ రాజకీయ దుమారం రేపారు.