బుల్లెట్ మహా అయితే చంపుతుందేమో, కానీ బ్యాలెట్ పవర్ఫుల్: నాయిని
అదిలాబాద్: బ్యాలెట్.. బుల్లెట్ కంటే ఎంతో పవర్ ఫుల్ అని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సోమవారం నాడు అన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అని మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నోసార్లు నిరూపితమైందన్నారు.
బుల్లెట్లు మహా అయితే ఇరవై మందిని లేదా వంద మంది వరకు చంపేస్తాయేమోనని, అయితే బుల్లెట్లతో అధికారంలోకి మాత్రం రాలేమన్నారు. బ్యాలెట్తోనే అధికారం వస్తుందని చెప్పారు. నాయిని అదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు) లో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మూడోసారి అధికారంలోకి వస్తున్నారని, అదేవిధంగా వరంగల్ ఉప ఎన్నికల్లోను విజయం టిఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ సమీపాల్లో పోలీస్ క్వార్టర్స్ నిర్మిస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన ఉంటేనే ప్రజలు మెచ్చుతారని చెప్పారు. పోలీసు డిపార్టుమెంట్ మంచి పాలనలో ప్రముఖ పాత్ర వహిస్తుందని అభిప్రాయపడ్డారు.