విషాదం: పోలీసు బైక్ను ఢీకొట్టి బావిలో పడిన ట్రాక్టర్, నలుగురు మృతి
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న పోలీసు బైక్ను ఢీ కొట్టి అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది.
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, బైక్ పై వెళ్తున్న ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పై వెళ్తున్న ఇద్దరు పోలీసులను ఏఎస్సై రాజేందర్, కానిస్టేబుల్ జుబేర్లుగా గుర్తించారు. సీఐ గౌస్బాబా సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.
దాదాపు 20మీటర్ల లోతు గల బావిలో ట్రాక్టర్ పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన కత్తుల శివకుమార్, పిల్లి సంతోష్, బొల్లి రాజు, కొంకట శ్రీకాంత్లుగా గుర్తించారు.
ఈ ఘటనలో తీవ్ర గాయలైన పోలీసులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ నాలుగు రోజుల క్రితమే ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.