బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్తాపంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలోని హైదరాబాద్ బిట్స్ పిలాని క్యాంపస్లో సోమవరం చోటు చేసుకుంది. చెన్నైకు చెందిన రాఘవ శాంతారామ్(21) హైదరాబాద్ బిట్స్ పిలాని క్యాంపస్లో ఇంజినీరింగ్(ట్రిపుల్ ఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసిన అనంతరం తన గదికి వెళ్లిపోయాడు. సోమవారం మధ్యాహ్నం వరకు గది నుంచి బయటికి రాకపోవడం, తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో స్నేహితులు వార్డెన్ సాయంతో తలుపులు పగలగొట్టారు.
రాఘవ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించి ఆవేదనకు గురయ్యారు. రాఘవ గతంలో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు.. ఆ మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఇన్స్పెక్టర్ చలపతి తెలిపారు.
చెన్నైలో ఉన్న మృతుడి తల్లిదండ్రులు వస్తే ఆత్మహత్య గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.