సహనం కోల్పోయిన జానారెడ్డి: అరే పోవయ్యా.. నువ్వు ఓటు ఏస్తేంది, ఎయ్యకపోతేంది
నాగార్జున సాగర్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో తెరాస, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అభ్యర్థులకు తమ తమ నియోజకవర్గాలలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తెరాస అభ్యర్థులను ప్రజలు పలుమార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా షాక్ తగిలింది. ఆయనకు తన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది.
మగవాళ్లు మాత్రమే వస్తారా?, ఆశ్చర్యం వేసింది: సొంత పార్టీకి విజయశాంతి షాక్
జానారెడ్డి అసహనం
పలువురు ఆయనను అడ్డుకున్నారు. దీంతో జానారెడ్డి సహనం కోల్పోయారు. జానా మాట్లాడుతూ.. ఎవరూ మాట్లాడటానికి వీల్లేదని, నేను మళ్లీ చెబుతున్నానని, కాంగ్రెస్ పార్టీతో ఉండాలనుకున్న వాళ్లు, నాతో మాట్లాడాలనుకున్న వాళ్లు ఇక్కడ ఉండాలని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారు బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. సప్పుడు చేయవద్దని, చెప్పింది వినాలన్నారు.
పోవోయ్ నువ్వు మొనగాడివా?
ఓ వ్యక్తి ఏదో ప్రశ్నించగా... అరే.. పోవోయ్.. నువ్వు మొనగాడివి వేస్తే (ఓటు) ఎంత, వేయకుంటే ఎంత? నువ్వు మొనగాడివి, పోవోయ్.. అన్నారు. మీరు అవసరం లేదని చెప్పారు. మీకు ఎక్కడ మంచిగా (ఏ పార్టీలో) అనిపిస్తే అక్కడకు వెళ్లి పని చేయించుకోండని, బాగుపడండని, నేను చేసినంత చేస్తున్నానని (నియోజకవర్గానికి) చెప్పారు. నేను చేసిన పని పట్ల అభిమానం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.
మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు
ఇంతకంటే మీతో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని జానారెడ్డి చెప్పారు. ఆయన తన ప్రచార వాహనంపై నిలబడి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన డ్రైవర్ను ఉద్దేశించి చేతులతో పద.. పద అని సంజ్ఞ చేశారు. ఆ తర్వాత కూడా అక్కడి గ్రామస్తులు ఆయనను కాసేపు అడ్డుకున్నారు. ఆయన వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.
నాగార్జున సాగర్ నుంచి పోటీ
కాగా, కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన పైన తెరాస తరఫున నోముల నర్సింహయ్య పోటీ చేస్తున్నారు. జానారెడ్డికి నోముల గట్టి పోటీ ఇస్తారని తెరాస భావిస్తోంది.