ఇక మీ నేతలు ఎందుకు: ఎమ్మెల్యేకు షాకిచ్చిన రైతులు, చేదు అనుభవం
హైదరాబాద్: పెద్దపల్లి శాసన సభ్యుడు మనోహర్ రెడ్డికి సంక్రాంతి రోజున చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందజేయాలని డిమాండ్ చేస్తూ గంగారం గ్రామరైతులు ఆయనను అడ్డుకున్నారు.
సోమవారం సాయంత్రం కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఓ దేవాలయంలో పూజలు చేసేందుకు ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు రైతులు ఎమ్మెల్యేను మధ్యలోనే అడ్డుకొని సాగునీరు తమ మండలానికి ఇప్పటి వరకు చేరలేదన్నారు.
ఎమ్మెల్యే నుంచి ఎలాంటి సమాధానం రాకపోడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. సాగునీటిని విడుదల చేస్తామని చెప్పడం వల్లే తాము పంటల సాగు చేపట్టామని, తీరా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని చివరి ఆయకట్టుకు నేటికీ నీరు అందలేదని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.
సాగునీటిని కూడా ఇవ్వలేని నేతలు ఎందుకు అని ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేయగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనం వెనుక పరుగులు తీశారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ ఎస్సై షేక్ జానీపాషా సమక్షంలో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగారు.