పోచారంకు చేదు: నిర్బంధించిన విద్యార్థులు, పోలీసుల లాఠీచార్జ్
హైదరాబాద్: మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియం వద్ద వెటర్నరీ విద్యార్థులు అడ్డుకున్నారు. జీవో 45 ప్రకారం ఉద్యోగ నియామకాలు జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు విద్యార్థులు మంత్రి ఎదుట నిరసన తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను తక్షణమే నిలిపివేయాలన్నారు. విద్యార్థులు మంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, మంత్రి పోచారంను వెటర్నరీ విద్యార్థులు అడ్డుకొని నిర్బంధించినట్లుగా కూడా తెలుస్తోంది. వెటర్నరీ డాక్టర్లు పోచారంను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థుల పైన లాఠీఛార్జ్ చేశారు.
సాగర్ను సుందరీకరిస్తాం: కెటిఆర్
హుసేన్ సాగర్ను సుందరీకరించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని మంత్రి కెటి రామారావు చెప్పారు. సాగర్లోకి వచ్చే వ్యర్థ జల నాళాలను 90 శాతం మళ్లించామన్నారు. అమెరికా నుంచి పూడిక యంత్రం దిగుమతి చేసుకున్నామని, సాగర్ను మంచినీటి సరస్సుగా తీర్చదిద్దుతామన్నారు.
కెటిఆఱ్ సాగర్ పూడికతీత పనులను మంగళవారం నాడు పరిశీలించారు. దీని కోసం ఉపయోగించనున్న కొత్త యంత్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సాగర్లోకి చుక్క కూడా మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
మురుగునీటి నాలాల డైవర్షన్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. వర్షాకాలంలోపు నాలాల పూడికతీత పనులు పూర్తి చేస్తామన్నారు. రూ.500 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మూసీనది, సాగర్ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.