అల్లుడు రూప రాక్షసుడు.. మద్యం సేవించి... అత్తపై ....
హైదరాబాద్ : అత్త .. తల్లి తర్వాత తల్లి లాంటిది. అమ్మ లాగే గౌరవించాలి. కానీ ఓ కసాయి మాత్రం తనకు పిల్లనిచ్చిన అత్తనే మట్టుబెట్టాడు. రోజు తాగి .. భార్యను చితకబాదడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పంపించమని కోరితే .. పంపకపోవడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు అల్లుడు.'
అత్తపైనే దాడి ..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం మిట్టగూడెనికి చెందిన నాశబోయిన వెంకన్న, కాశమ్మకు ముగ్గురు కూతుళ్లు. అనారోగ్య సమస్యలతో కొన్నాళ్ల క్రితం వెంకన్న మృతిచెందాడు. దీంతో కుటుంబభారం కాశమ్మపై పడింది. కూలి పనులు చేసుకుంటూ కూతుళ్లను పెంచి పెద్ద చేసింది. తొలుత ఇద్దరు కూతుళ్లకు పెళ్లిచేసింది. చిన్న కుమార్తెకు చింతలపాలెం మండలం మల్లారెడ్డగూడేనికి చెందిన బొడ్డు అఖిల్కు ఇచ్చి పెళ్లి చేశారు. అఖిల్ బైక్ సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్గా పనిచేస్తుంటాడు. వీరికి మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. అయితే అఖిల్ మద్యానికి బానిసయ్యాడు. ప్రతీరోజు తాగి ఇంటికొచ్చేవాడు. భార్యను తిడుతూ, చేయి చేసుకునేవాడు.
పంపించనని చెబితే ..
ఇలా గొడవలు జరగడంతో భార్య పుట్టింటికి వెళుతుండేది. ఇంటికొచ్చి బాగుంటానని అఖిల్ చెప్పేవాడు. పెద్దలను ఒప్పించేవాడు. అలా మాటిచ్చి కొద్దిరోజులు మద్యం తాగకుండా దూరంగా ఉన్నాడు. తర్వాత మళ్లీ మందు తాగడం ప్రారంభించాడు. గత నెల 25వ తేదీని మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె భయాందోళనకు గురై .. తల్లి గారింటికి వచ్చింది. తర్వాత తన అత్తకు ఫోన్ చేసి .. కూతురిని కాపురానికి పంపించాలని కోరారు. అయితే ఎప్పుడూ ఇలానే బతిమాలాడుతున్నారని .. తర్వాత తాగి కొడుతున్నావని పంపించబోనని అత్త తేల్చిచెప్పింది. దీంతో అత్తపై కోపం పెంచుకున్నాడు.
అత్తపై కోపంతో ..
అఖిల్ తన అత్తపై కసి పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. శనివారం రాత్రి మిట్టగూడేనికి చేరుకున్నాడు. అప్పుడే పడుకున్న అత్తను లేపి .. కూతురిని కాపురానికి పంపించాలని కోరారు. ఈ అంశంపై వారి మధ్య వాగ్వివాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అఖిల్ .. అప్పటికే తనతో తీసుకొచ్చిన కత్తితో అత్తపై దాడి చేశాడు. విచక్షణరహితంగా దాడి చేసి పరారయ్యాడు. అఖిల్ దాడితో కుప్పకూలిన తల్లిని చూసి లలిత ఆందోళనకు గురయ్యారు. లబో దిబోమని మొత్తుకోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. వెంటనే కాశమ్మను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రగాయాలైన ఆమె .. మార్గమధ్యలోనే చనిపోయారు. అత్తపై విచక్షణరహితంగా దాడిచేసిన అఖిల్ .. నిన్న పోలీసులకు లొంగిపోయాడు. కాశమ్మ రెండో అల్లుడు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హుజూర్ నగర్ పోలీసులు తెలిపారు.