2019లో టిఆర్ఎస్ ఓటమి ఖాయం: కిషన్ రెడ్డి
మహబూబ్నగర్:2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమి ఖాయమని బిజెపి శాసనసభపక్ష నాయకుడు కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ప్రజలు టిఆర్ఎస్ పాలన పట్ల సంతృప్తిగా లేరని కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్ పాలనపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు.
మంగళవారం నాడు మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్శిటీని బిజెపి శాసనసభపక్ష నేత కిషన్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ తన నీడను తానే చూసి భయపడుతోందని చెప్పారు.
టిఆర్ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల, పాలమూరు యూనివర్సిటీని మంగళవారం కిషన్ రెడ్డి సందర్శించారు. 2019లో టీఆర్ఎస్కు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఏ వర్గాన్ని తీసుకున్నా తీవ్ర నిరాశతో ఉన్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సీఎం కేసీఆర్ అభివృద్ధి ఎజెండాను ప్రక్కన బెట్టారని చెప్పారు. కులాల వారీగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పనులు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో పార్టీ క్యాడర్ విస్తృతంగా పర్యటించి సమస్యలను గుర్తిస్తోందన్నారు. అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శిస్తానని చెప్పారు.
నాలుగేళ్లుగా ఒక్క టీచర్ను కూడా విశ్వవిద్యాలయాలలో నియమించలేదని తెలిపారు. అన్నింట్లోనూ నిధుల కొరత ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.