'2000 కెసిఆర్ హోర్డింగ్లు, రూ.450 కోట్ల ఖర్చు': కెసిఆర్ను అడిగితె తెలుస్తుంది: రేవంత్
హైదరాబాద్: భాగ్యనగరంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా కెసిఆర్ ప్రభుత్వం 2000 హోర్డింగులు ఏర్పాటు చేసిందని, ఇందుకోసం రూ.450 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు.
గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారి తొక్కుతోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు కాంగ్రెస్ నేతలు ఉదయం ఫిర్యాదు చేశారు. డివిజన్ల పునర్విభజన మొదలు, రిజర్వేషన్ల ప్రక్రియ వరకు ఇష్టానుసారం ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు.
అధికార టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ చేపడుతున్నారన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు హైదరాబాదులో కెసిఆర్ ప్రభుత్వం భారీగా హోర్డింగులు పెట్టిందన్నారు. హోర్డింగులు, ఫ్లెక్సీలు ఉండవద్దన్నారు. రిజర్వేషన్లు ఖరారైన వారం రోజుల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయలన్నారు.
రిజర్వేషన్ల ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు తీసుకోవాలని, అభ్యంతరాల తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గవర్నర్కు హోర్డింగుల పైన ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూలులోని 31 రోజుల్లో సెలవులను మినహాయించాలన్నారు. పబ్లిసిటీ కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతోందన్నారు.
గవర్నర్ను కలిసిన బిజెపి నేతలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తే ఆమోదించవద్దని బిజెపి నేతలు గవర్నర్ నరసింహన్కు విజ్ఞప్తి చేశారు. వారు మధ్యాహ్నం గవర్నర్ను కలిశారు. అనంతరం మాట్లాడుతూ... ప్రచారం కోసం ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
కెసిఆర్ను అడిగితే తెలుస్తుంది: రేవంత్ రెడ్డి
అందరిలా మేమూ వెళ్తే రూ.వేల కోట్ల కాంట్రాక్టులు, మంత్రి పదవులు, బుగ్గకార్లు వస్తాయి, కానీ వాటి జోలికి వెళ్లకుండా పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవానికి కట్టుబడి ఉన్నామని, గత ప్రభుత్వాలు ఏం చేశాయని విమర్శిస్తున్న కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని అడిగితే తెలుస్తుందని టిడిపి నేత రేవంత్ రెడ్డి గురువారం రాత్రి అన్నారు.
శ్రీనివాస్ యాదవ్కు టిడిపిని విమర్శించే హక్కులేదన్నారు. హోంమంత్రినని చెప్పుకొంటున్న నాయిని నర్సింహా రెడ్డి తలపై ఉన్న టోపిని కేసీఆర్ లాక్కుంటే చేతిలో ఉన్న లాఠీని కేటీఆర్ లాక్కున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
మానాన్న మహిళలకు 75 శాతం రిజర్వేషన్లు ఇచ్చాడని గొప్పలు చెప్పుకొంటున్న ఎంపీ కవిత రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ఎందుకు చోటివ్వలేదో మీ నాన్నను అడిగితే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. నగరానికి తొమ్మిది నెలల కాలంలో కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు.