తెలంగాణ బీజేపీ ఇంఛార్జీగా సునీల్ బన్సల్: పశ్చిమబెంగాల్, ఒడిశా తర్వాత ఇక్కడ
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ తో పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరారు. మరికొంతమంది ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు అంటున్నారు. తాజాగా, మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇంఛార్జీగా సునీల్ బన్సల్ ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం.
తెలంగాణతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశాలకు కూడా ఆయనే ఇంఛార్జీగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఇంఛార్జీగా ఉన్న తరుణ్ ఛుగ్ స్థానంలో సునీల్ బన్సల్ నియమితులయ్యారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సునీల్ బన్సల్ ఉత్తరప్రదేశ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కాగా, సునీల్ బన్సల్.. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో తరుణ్ ఛుగ్ను తప్పించి.. సునీల్ బన్సల్ను ఇంఛార్జీగా నియమించడం చర్చనీయాంశంగా మారింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడుకు ఉపఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో బీజేపీ.. సునీల్ బన్సల్ను రంగంలోకి దించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, పశ్చిమబెంగాల్, ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో సునీల్ బన్సల్ కీలక పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి సునీల్ బన్సల్ కూడా ఒక కారణమని భావించిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణకు ప్రత్యేకంగా పంపినట్లు తెలుస్తోంది.