పవన్ కళ్యాణ్ను ఖాతరుచేయని బీజేపీ, ఆ లెక్క తేలాకే అందుకే దూకుడు
హోదా పైన పవన్ స్పందించినప్పుడు ఏపీ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మూడు రోజుల క్రితం రోహిత్ వేముల మృతి పైన పవన్ స్పందించినప్పుడు తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు.
హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎవరికి వారు తగ్గడం లేదు. 2014లో పవన్ బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతు పలికారు. ఇటీవల ఆయన బీజేపీని పలు అంశాల్లో నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ అంశానికి సంబంధించిన ప్రశ్న సంధిస్తే తెలంగాణ బీజేపీ నేతలు, ఏపీ అంశానికి సంబంధించిన అంశాన్ని సంధిస్తే ఏపీ బీజేపీ నేతలు ధీటుగా.. ఒకింత ఘాటుగా స్పందిస్తున్నారు.
2014 ఎన్నికల్లో తమకు మద్దతిచ్చాడనే కనికరం కూడా చూపించడం లేదు! ప్రతి అంశం పైన తమ పార్టీ స్పష్టతతో ఉందని, అలాంటప్పుడు తమను నిలదీస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వెంకయ్య నాయుడి నుంచి కిషన్ రెడ్డి వరకు పవన్పై కౌంటర్ ఇస్తున్నారు.
మరో ఆప్షన్ లేకే అని చెప్పాక...
పవన్ తొలుత ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విభజనతో నవ్యాంధ్ర నష్టపోయిందని, ఈ కారణంగానే మరో ఆప్షన్ లేక తాను బీజేపీకి మద్దతిచ్చానని పవన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ బీజేపీ కూడా మోసం చేస్తోందని, ఊరుకునేది లేదన్నారు. హోదా పైన ఆయన పలుమార్లు సామాజిక అనుసంధాన వేదికల పైన, బహిరంగ సభల ద్వారా నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని వదిలేది లేదని పవన్ స్పష్టం చేశాక.. ఏపీ నేతలు కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
హోదా వర్సెస్ ప్యాకేజీ
ప్రత్యేక హోదా సాంకేతిక సమస్య అని, నాటి యూపీఏ ప్రభుత్వం హోదాను చట్టంలో పెడితే సమస్య రాకుండా ఉండేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకే తాము హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడున్నారని అంటున్నారు. అయితే, ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందనేది జనసేన మాట.
హోదాపై ఘాటుగానే..
టిడిపి ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ సున్నితంగానే విమర్శలు గుప్పించడం గమనార్హం. అదే బీజేపీ పైన మాత్రం ఘాటుగానే స్పందిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పైన చేసే విమర్శలకు బీజేపీ నేతలు స్పందించడం లేదు. కానీ కేంద్రం పైన చేసే విమర్శలకు మాత్రం ధీటుగా స్పందిస్తున్నారు.
పవన్ని లెక్కలోకి తీసుకోని బీజేపీ
అంతకుముందు హోదా పైన పవన్ స్పందించినప్పుడు ఏపీ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. స్వయంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సహా చురకలు అంటించారు. తాజాగా, మూడు రోజుల క్రితం రోహిత్ వేముల మృతి పైన పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు. పవన్కు తాము సమాధానం చెప్పవలసిన అవసరం లేదని, అసలు ఆయనను తాము లెక్కలోకే తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఆయనను ఖాతర్ చేయడం లేదన్నారు. అసలు వేముల రోహిత్ ఘటన జరిగి దాదాపు సంవత్సరం అవుతోందని, పవన్ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏమిటనేది కిషన్ రెడ్డి ప్రశ్న. మొత్తానికి 2019 నాటికి పవన్ తమతో వచ్చేందుకు సిద్ధంగా లేడని భావిస్తున్న బీజేపీ ఆయనపై దూకుడుగానే వ్యవహరిస్తోందని అంటున్నారు.
ఆలస్యంగా స్పందిస్తున్నారా?
రోహిత్ ఘటన జరిగిన దాదాపు ఏడాది తర్వాత పవన్ స్పందించారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక నోట్ల రద్దు పైన తొలుత స్వాగతించిన పవన్.. పది రోజుల తర్వాత సమస్యల పైన మండిపడ్డారు. ప్రత్యేక హోదా పైన తాము మొదటి నుంచి పోరాడుతుంటే.. పవన్ ఆలస్యంగా వచ్చారని ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. హోదా పైన వైసిపినే చిత్తశుద్ధితో పోరాడుతోందనేది వైసిపి వాదన.