'కేసీఆర్కు నాటి అనుభవమే, ఎన్టీఆర్ ఇలా చేసి ఇక్కడే ఓడిపోయారు'
హైదరాబాద్: బీజేపీ - కాంగ్రెస్ పార్టీల అవసరం లేదని, దేశ రాజకీయాల్లో మార్పు అని చెబుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. దీనికి ఆయన ఓ ఉదాహరణ కూడా చెప్పారు. నాడు ఎన్టీఆర్ ఇలాంటి ప్రయత్నాలు జాతీయస్థాయిలో చేసి, ఆ తర్వాత రాష్ట్రంలో ఓడిపోయారని చెబుతున్నారు.
చంద్రబాబు ఫ్రెండ్, మరిన్ని అధికారాలు కావాలి: కేసీఆర్కు కరుణానిధి దిశానిర్దేశనం
నాడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్ ఓడిపోయారు
ఆనాడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్ సొంత రాష్ట్రంలో ఓటమి పాలయ్యారని, ఇప్పుడు కేసీఆర్కూ అదే గతి పడుతుందని డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అందుకు ఎన్టీఆరే నిదర్శనమన్నారు.
ఎన్టీఆర్ కొంత విజయం సాధించారు కానీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో కూటముల కోసం ప్రయత్నించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఆ విషయంలో ఆయన కొంత విజయం సాధించినా, సొంతం రాష్ట్రంలో మాత్రం దారుణంగా ఓడిపోయారని తెలిపారు.
మళ్లీ అదే జరుగుతుంది
2019 ఎన్నికల్లో మళ్లీ ఇలాగే జరుగుతుందని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ను తోక పార్టీ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాంగ్రెస్తో సంబంధాలున్న నేతలను ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుమతితోనే ఆయన అంతమందిని కలవగలుగుతున్నారని, ఆయన పర్యటనలు మొత్తం కాంగ్రెస్కు లాభం చేకూర్చేలా ఉన్నాయన్నారు.
తెలంగాణలో బస్సుయాత్ర
తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని లక్ష్మణ్ చెప్పారు. జూన్ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. 50 నియోజకవర్గాల్లో సభలు ఉంటాయని వెల్లడించారు. కాగా, ఇటీవల కేసీఆర్ పలువురు జాతీయస్థాయి ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే.