మోడీని అంటావా.. నీ రోగాల మాటేమిటి: బీజేపీ, 'ఓటమి'పై కేసీఆర్వి బెదిరింపులా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం పలు బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, బీజేపీ నేతలు వేర్వేరుగా తీవ్రంగా మండిపడ్డారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలవకుంటే తనకు వచ్చే నష్టమేమీ లేదని, కానీ తెలంగాణ చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుందని చెప్పారు. అలాగే మోడీ విభజన రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వారు వేర్వేరుగా మాట్లాడారు.
చివరి నిమిషం దాకా ఆశపెట్టి: కేసీఆర్కు మరో భారీ షాక్, రాజీనామా చేసిన కీలకనేత
మోడీని అంటావా.. నీకున్న రోగాలు ఎన్నో
కేసీఆర్ అబద్దాలతో మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి హిందూ, ముస్లీం రోగం ఉందని కేసీఆర్ చెప్పడం విడ్డూరమని, అలా చెబితే ప్రజాస్వామ్యంలో ఉండకూడని రోగాలు అన్నీ తెరాస అధినేతకు ఉన్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న నీకు (కేసీఆర్) రాజ్యాంగం, రాజ్యాంగ పరిధి తెలుసా అని ఇంద్రసేనా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేతిలో మరోసారి మోసపోవడానికి సిద్దంగా లేరని చెప్పారు.
కేసీఆర్ ఇంట్లో పడుకోవడం కాదు, అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు
అదే సమయంలో ఇంద్రసేనా రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన కూడా నిప్పులు చెరిగారు. నాలుగు రాష్ట్రాలలో ప్రచారంలో పాల్గొనని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కేవలం తెలంగాణలోనే ప్రచారానికి రావడంలో రహస్యం ఏమిటో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక కేసీఆర్ ఇంట్లో పడుకోవడం కాదని, అండర్ గ్రౌండ్లోకి వెళ్లడం మాత్రం ఖాయమని చెప్పారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్కు సిక్త్ సెన్స్ అర్థమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందుకే ఓడిపోయి ఇంట్లో కూర్చుంటానని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తెరాస ఓడిపోతే తనకు వచ్చే నష్టం లేదని, ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటానని, గెలవకుంటే రాష్ట్రం చంద్రబాబు చేతిలోకి వెళ్తుందని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ బెదిరిస్తున్నారా, కరెక్ట్ చెప్పారు
ఓడిపోతే ఫాంహౌస్లో పడుకుంటానని అంటే ఎవరిని బెదిరిస్తున్నారని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ కూడా ప్రశ్నించారు. ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండి ధర్మాన్ని నెరవేర్చవచ్చునన్నారు. ప్రతిపక్షంలో కూడా ఉండలేమని కాడి కింద పడేస్తున్నారన్నారు. తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న కేసీఆర్, అలాగే కేటీఆర్ మాటలను ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ కరెక్టే చెప్పారని తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం అన్నారు. ఆయన గెలిచినా, ఓడినా ఫాంహౌస్లోనే ఉంటారని ఎద్దేవా చేశారు.