భూ కబ్జాలే కాదు నయీమ్ తో సెటిల్ మెంట్లు కూడా .. భద్రకాళి గుడికి రండి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇచ్చారు. బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ టిఆర్ఎస్ నేతల భాగోతాలు వరంగల్ ప్రజలకు తెలుసంటూ మండిపడ్డారు. భూకబ్జాలు మాత్రమే కాదు గ్యాంగ్ స్టర్ నయీమ్ తో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్ లు చేసింది ఎవరు అంటూ ప్రశ్నించారు. అభివృద్ధిపై రేపు సాయంత్రం భద్రకాళి గుడికి టీఆర్ఎస్ నేతలు రావాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ తోపుగాడు ఏం కాదు, బడా చోర్ సీఎం .. భద్రకాళీ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా ? బండి సంజయ్ సవాల్
స్మార్ట్ సిటీ నిధులపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్
స్మార్ట్ సిటీ నిధులపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు రావు పద్మ. వరంగల్ అర్బన్ జిల్లాలో పోలీసు అధికారులు ఎమ్మార్వోలు ఎందుకు సస్పెండ్ అవుతున్నారో ప్రజలందరికీ తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ముస్లింలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. వరంగల్ కి ఎయిర్ పోర్టు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు బిజెపి నేతలు. టిఆర్ఎస్ పార్టీలో 27 మంది కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు అయ్యారని ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో దోచుకుంటున్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం గుత్తేదారుల ప్రభుత్వం గా మారిందని విమర్శలు గుప్పించారు.
ఓటమి భయంతో కావాలని వరంగల్ లో ఎన్నికలు జాప్యం చేస్తున్నారని విమర్శలు
హైదరాబాద్లో రెండు నెలల ముందు ఎన్నికలు పెట్టినవారు, వరంగల్లో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతో కావాలని ఎన్నికలు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు . వరంగల్ లో ఓటమి భయంతో పిచ్చి కూతలు కూస్తున్నారు అని బిజెపి నేత రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై సవాలును స్వీకరించే దమ్ము లేక వ్యక్తిగత దూషణలకు టీఆర్ ఎస్ నాయకులు దిగుతున్నారు అని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ఉరేసుకునే పరిస్థితి వస్తుంది
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ఉరేసుకునే పరిస్థితి వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో వరదలకు పదివేల రూపాయలు పరిహారం ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ వరంగల్ లో వరదల సమయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాశీకి పోయి గంగలో మునగాలని, కొన్ని పాపాలు అయినా తగ్గుతాయని రాకేష్ రెడ్డి విమర్శించారు. వరంగల్ లో చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలంటే వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై నన్నపునేని నరేందర్ , వినయ్ భాస్కర్ ఫైర్
బండి సంజయ్ చేసిన సవాల్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తనపై ఒక భూకబ్జా ఆరోపణ నిరూపించినా రాజకీయాలకు రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ నిరూపించ లేకపోతే బండి సంజయ్ రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు. భద్రకాళి అమ్మవారిని అపవిత్రం చేయొద్దని నన్నపనేని నరేందర్ వ్యాఖ్యానించారు . వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నాలుక చీరేస్తా మంటూ అంటూ హెచ్చరికలు జారీ చేశారు .వరంగల్ కు కేంద్రం అసలు ఏమీ చేయలేదని విమర్శించారు. ఇక ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఘాటుగా బదులిచ్చారు.