శ్రీకళారెడ్డికి షాక్: హుజూర్ నగర్లో బీజీపీ అభ్యర్దిగా తెరపైకి కొత్త అభ్యర్థి!
తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటి వరకు బీజేపీ నుండి శ్రీకళారెడ్డి బరిలోకి దిగుతారంటూ ప్రచారం సాగింది. అయితే అనేక తర్జన భర్జనల తరువాత పార్టీ అభ్యర్దిని ఖరారు చేసారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం అభ్యర్ధిని ఎంపిక చేసింది. హుజూర్ నగర్ అభ్యర్ధిగా కోట రామారావును ఎంపిక చేస్తూ రాష్ట్ర కార్యవర్గం జాతీయ పార్టీకి సిఫార్సు చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్ఆర్ఐ కోటా అప్పిరెడ్డి ఉండగా చివరకు రామారావుకు టికెట్ దక్కింది. మొదట శ్రీకళా రెడ్డికి టికెట్ ఖరారు అవ్వగా కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోటీ నుండి తప్పుకున్నారు.
హరీశ్రావుకు కోపమొచ్చింది.. ఆ అధికారికి చివాట్లు.. ఇంతకు ఏం జరిగిందంటే..!
ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ యస్ నుండి సైదిరెడ్డి..కాంగ్రెస్ నుండి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. హుజూర్నగర్లో పాగా వేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గెలుపు బాధ్యతను సీనియర్ నేత పల్లారాజేశ్వర్ రెడ్డికి అప్పగించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో గెలిచిన బీజేపీ హుజూర్నగర్ను కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. మాజీ ఎమ్మెల్యే కుమార్తె, కోదాడ వాసి శ్రీకళారెడ్డి పేరు ముందుగా తెరపైకి వచ్చినా చివరకు రామారావు పేరును ఖరారు చేసింది. శ్రీకళారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నామినేషన్లకు ఈనెల 30 వరకూ గడువు ఉంది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆయన తన సతీమణికే సీటు ఖరారు చేయించుకున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. టీఆర్ యస్ నుండి గతంలో పోటీ చేసిన సైదిరెడ్డికే తిరిగి సీటు ఖరారు చేసారు. గెలుపు బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ భుజాన వేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఒక్కో మండలానికి ముగ్గురు నేతలను ఇన్ ఛార్జ్ లను నియమించారు.
వీరికి ఒక్కో ఎమ్మెల్యేను జత చేసారు. వీరంతా ప్రతీ మండలంలోని ప్రతీ గ్రామంలో స్థానిక నేతలను కలుపుకొని ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఉప ఎన్నికలో గెలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో మహా కూటమిగా పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు కూడా ఉమ్మడి అభ్యర్దిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్ధి ఇప్పటికే ఖరారు కావటం.. తమతో సంప్రదింపులు చేయకపోవటంతో వారి నిర్ణయం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.