తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్(48)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్షుడిగా లక్ష్మణ్ పదవి కాలం ముగియడంతో తదుపరి అధ్యక్షుడి ఎంపికపై కొంతకాలంగా అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలు,ఇక్కడి పరిస్థితులను పరిశీలనలోకి తీసుకుని చివరకు బండి సంజయ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేపథ్యం.. అలాగే బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో అధ్యక్షుడిగా సంజయ్ నియామకమే సరైందని అధిష్టానం భావించినట్టు సమాచారం.
Recommended Video
అధ్యక్ష పదవి రేసులో లక్ష్మణ్,మురళీధర్ రావు,డీకే అరుణ తదితరుల పేర్లు పరిశీలించినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని జనాల్లోకి తీసుకెళ్లగల సత్తా సంజయ్కి ఉందని అధిష్టానం విశ్వసించినట్టు తెలుస్తోంది. నిజానికి లక్ష్మణ్నే మరోసారి అధ్యక్షుడిగా కొనసాగిస్తారని భావించినప్పటికీ.. బండి సంజయ్ నియామకం ద్వారా ఉత్తర తెలంగాణలో మరింత పట్టు సాధించవచ్చునని పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ని అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ కార్యకర్తల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
సంజయ్ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేస్తూ వచ్చారు.అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్గా,పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.కరీంనగర్ కోపరేటివ్ అర్బన్ బ్యాంకులో రెండు పర్యాయాలు (1994-1999, 1999-2003) డైరెక్టర్గా పనిచేశారు. అలాగే బీజేపీ జాతీయ కార్యాలయంలో ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంజార్జిగానూ పనిచేశారు. ఎల్కె అద్వానీ చేపట్టిన రథయాత్రలో వెహికల్ ఇంచార్జిగా పనిచేశారు.2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 52వేల పైచిలుకు ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.2018లో జరిగిన ఎన్నికల్లో 60వేల పైచిలుకు ఓట్లు సాధించి మరోసారి రెండోసారి స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్పై పోటీ చేసి సంజయ్ విజయం సాధించారు.