ఈటల రాజేందర్ రాజీనామా చేయు: తక్కువ పరీక్షలు నిర్వహించడంపై కృష్ణసాగర్ రావు డిమాండ్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుపై కేంద్రంపై సీఎం కేసీఆర్ విరుచుకుపడటంతో అగ్గిరాజేసింది. రాష్ట్రంలో తక్కువ కరోనా వైరస్ పరీక్షలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కావాలనే తక్కువ పరీక్షలు చేస్తున్నారని.. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు అని ఆయన ఆరోపించారు. దేశ సగటు కన్నా తక్కువ టెస్టులు చేయడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.
మోదీ తీరు 'ప్లేయింగ్ టు ది గ్యాలరీ’.. నిర్మల ప్రకటనపై టీఆర్ఎస్ ఫైర్.. టీ-బీపాస్పై కేటీఆర్ ప్రకటన
తక్కువ పరీక్షలు..
తక్కువ పరీక్షలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కృష్ణసాగర్ రావు ఆరోపించారు. ఐసీఎంఆర్ మార్గనిర్దేశకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారించడం లేదని బీజేపీ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు డైలీ బులెటిన్ కూడా ఐసీఎంఆర్ విధానాల ప్రకారం రావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పరీక్షలు చేయకుండా.. మ్యానిపులేట్ చేస్తున్నారని ఆరోపించారు. వైద్య పరీక్షలు ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు.
దేశ సగటు కన్నా తక్కువ..
కరోనా వైరస్ తక్కువ పరీక్షలు చేయడం వల్ల అదేస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు కూడా అంతే మొత్తంలో ఉంది. కానీ దేశవ్యాప్తంగా.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉంది అని, ఇది ప్రభుత్వ నైతిక విలువలకు విఘాత కలిగించేదిగా ఉంది అని కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. మే 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 22 వేల 842 మందికి పరీక్షలు చేశారు. కానీ ఛత్తీస్ గడ్ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా అంతకన్నా ఎక్కువ పరీక్షలు చేశారని గుర్తుచేశారు.
Recommended Video
ఏపీ, తమిళనాడులో..
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రోజుకు 9 వేల మందికి పరీక్షలు చేస్తే.. తెలంగాణలో రోజుకు 200 మందికి మాత్రమే టెస్టుుల చేస్తున్నారని తెలిపారు. 10 లక్షల జనాభాకు దేశంలో 1025 మందికి పరీక్షలు చేస్తుంటే... తెలంగాణలో మాత్రం అది 546గా ఉంది అని వివరించారు. తమిళనాడులో ఇప్పటివరకు 3 లక్షల మందికి, ఏపీ లక్షా 75వేల మందికి పరీక్షలు చేశారని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వ తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని కృష్ణ సాగర్ రావు డిమాండ్ చేశారు.