బీజేపీ డిజిటల్ బోర్డు: జీహెచ్ఎంసీ షాక్.. రూ.55వేల జరిమానా విధింపు.. ట్విస్ట్ ఏంటంటే!!
తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సమయంలో టిఆర్ఎస్, బీజేపీల కోల్డ్ వార్ కొనసాగుతోంది. సాలు దొర సెలవు దొర అంటూ బిజెపి చేపట్టిన డిజిటల్ డిస్ ప్లే బోర్డు ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇక టిఆర్ఎస్ పార్టీ ఆగ్రహానికి కారణంగా మారింది.
డిజిటల్ డిస్ ప్లే బోర్డు తొలగించాలని పోలీసుల ఒత్తిడి.. అయినా బీజేపీ ససేమిరా
కల్వకుంట్ల కౌంట్ డౌన్ పేరుతో బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద డిజిటల్ డిస్ ప్లే బోర్డు, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటు పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు డిజిటల్ డిస్ ప్లే బోర్డును తీసివేయాలని బీజేపీ నాయకుల పై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ బిజెపి నాయకులు బోర్డు ను తొలగించడానికి ససేమిరా అన్నారు. అయితే తాజాగా జిహెచ్ఎంసి డిజిటల్ డిస్ ప్లే బోర్డు, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై 55 వేల రూపాయల పెనాల్టీ విధించింది.
రంగంలోకి జీహెచ్ఎంసీ.. డిజిటల్ బోర్డు ఏర్పాటు పై చర్యలు
సాలు దొర సెలవు దొర అంటూ నాంపల్లిలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ వద్ద బిజెపి డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇక టిఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండనుంది అన్న వివరాలను అందులో పొందుపరుస్తూ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు పై అభ్యంతరం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో బిజెపి నేతలపై విరుచుకుపడ్డారు. ఇక ట్విట్టర్ ద్వారా ఓ నెటిజన్ జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిహెచ్ఎంసి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన డిజిటల్ బోర్డుపై చర్యలకు ఉపక్రమించింది.
55వేల జరిమానా విధించిన జీహెచ్ఎంసీ.. అయినా ట్విస్ట్ ఇదే!!
జిహెచ్ఎంసి అధికారులు దీనిపై 50 వేల జరిమానా విధించారు. ఇక అక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసినందుకు మరో ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని ఏర్పాటు చేశారని, అందుకే పెనాల్టీ వేసినట్లుగా చలాన్లలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అసలు ట్విస్ట్ ఏమిటంటే జిహెచ్ఎంసి జరిమానా విధించినప్పటికీ బిజెపి నేతలు డిజిటల్ డిస్ ప్లే బోర్డును మాత్రం తొలగించలేదు. ఇప్పటికీ బిజెపి కార్యాలయం ముందు డిజిటల్ బోర్డు అలాగే ఉండటం గమనార్హం.