రాముడిని కూడా మోసం చేసిన బీజేపి..! దశాబ్దాల తరబడి అవే మేనిఫెస్టోలా అని మండి పడ్డ కేటీఆర్..!!
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో పత్రికలు తమ కర్తవ్యాన్ని బాద్యతాయుతంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నాయకులను నిలదీస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కు మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పులను సరిదిద్దుకుంటామని చెబుతోందని, 60 ఏళ్లుగా అధికారంలో ఉండి తప్పులు ఎందుకు సరిదిద్దుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు మోడీ హైదరాబాద్ కు ఏం చేశారో చెప్పాలని నిలదీసారు. చట్టపరంగా వచ్చిన డబ్బు తప్ప నగరానికి బీజేపీ ఐదేండ్లుగా ఏం ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ యాగాలు చేస్తారని, దేవుడిని నమ్ముతారని మోడీ విమర్శించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని కేటీఆర్ తెలిపారు.
రాముడిని కూడా బీజేపీ మోసం చేసిందన్నారు. తన చిన్నప్పటి నుంచి రామ మందిరం కడతామని మ్యానిఫెస్టోలో పెడుతున్నారని ఇప్పటివరకు కట్టలేదని మళ్లీ కడతామని మ్యానిఫెస్టో రూపొందించారని తెలిపారు. ఈ రెండు పార్టీలు తప్ప ఇంకో పార్టీ కేంద్రంలో రాకుండా చేస్తున్నారన్నారని, బీజేపీ పార్టీ ఇండియా-పాకిస్థాన్, మందిర్- మసీద్ తప్ప వేరేదేమీ మాట్లాడటం లేదని, కాంగ్రెస్ వాళ్లు 60ఏండ్లుగా పనిచేసి దేశంలో అవినీతిని పెంచారని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అవకాశం ఇవ్వాలని అడుగుతోందని తెలిపారు. ఒక కమిట్ మెంట్ ఉన్న నాయకుడు ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రజలు ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని కోరారు. మల్కాజిగిరి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని ప్రజలకు విజ్నప్తి చేసారు కేటీఆర్.