టీఆర్ఎస్ జోరుపై బీజేపీ కన్ను.. కోల్బెల్ట్ ఏరియాలో కిషన్ రెడ్డి కొత్త మార్క్ పాలిటిక్స్
హైదరాబాద్ : టీఆర్ఎస్ జోరుపై బీజేపీ కన్నేసిందా? లోక్సభ ఎన్నికల ఫలితాల జోష్తో ఉత్తర తెలంగాణలో మరింత పట్టు సాధించే దిశగా కసరత్తు చేస్తోందా? 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలం పుంజుకుని అధికారంలోకి వస్తామంటున్న రాష్ట్ర బీజేపీ నేతల కలలు నిజమవుతాయా? కారు వేగానికి కాషాయం కళ్లెం వేస్తుందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇచ్చే రీతిలో కనిపిస్తున్నాయి. తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. టీఆర్ఎస్కు ఎలాగైనా చెక్ పెట్టి తెలంగాణలో కాషాయం జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతోంది.
టీఆర్ఎస్ పునాదులు తెలంగాణలో పదిలం..!
ఉద్యమ నేపథ్యంతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ పునాదులు తెలంగాణలో మరింత బలపడ్డాయి. క్షేత్రస్థాయిలో ప్రజాదరణ చూస్తే కారు జోరుకు ఢోకా లేదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి పావులు కదుపుతోంది. ఆ క్రమంలో తెలంగాణలో పట్టు బిగించడానికి రెడీ అవుతోంది. అదే క్రమంలో లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో పార్టీకి జనాదరణ పెరిగిందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.
పోలీస్ అధికారి అర్ధనగ్న ప్రదర్శన.. విజయవాడలో అలజడి..!
క్షేత్రస్థాయిలో పట్టు.. కారు జోరుకు ప్రజల అండదండ..!
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ తెలంగాణలో తొలిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరింది. వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువైంది. ఆ క్రమంలో గత డిసెంబరులో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు గంప గుత్తగా ఓట్లు పడ్డాయి. అలా రెండోసారి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ వ్యూహాలతో రాష్ట్రంలో మరో పార్టీకి సరైన గుర్తింపు లేని పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను కారెక్కించిన ఘటన కేసీఆర్ సొంతం.
గులాబీ జెండా తప్ప మరో జెండా ఏది?
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉనికి లేని తరుణంలో బీజేపీ నేతలు దృష్టి సారించారు. 2023 ఎన్నికల నాటికి బలపడి తెలంగాణలో అధికారం దక్కించుకుంటామని చాలా సందర్భాల్లో బీజేపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అదలావుంటే ఆ మధ్య కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లలో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బీజేపీ స్ట్రాటజీ.. కారుకు కమలం బ్రేకులు వేసేనా?
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఆ క్రమంలో స్ట్రాటజీ ప్లే చేస్తోంది. అడపా దడపా రాష్ట్రానికి కేంద్ర మంత్రులు వస్తూ బీజేపీ ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడంతో తెలంగాణలో బీజేపీకి పట్టుందనేది ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ఇంకొంచెం దృష్టి పెడితే టీఆర్ఎస్ను ఢీకొట్టడం పెద్ద విషయం కాదనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి ఆయువుపట్టైన కోల్బెల్ట్ ప్రాంతంలో పర్యటించడం చర్చానీయాంశమైంది.
ఉత్తర తెలంగాణపై బీజేపీ కన్ను.. కోల్బెల్ట్ ఏరియాలో బలం పెంచుకునేలా..!
ఉత్తర తెలంగాణలో మరింత బలం పుంజుకోవాలంటే తొలుత సింగరేణి కార్మిక సంఘాలకు దగ్గర కావడంతో పాటు కోల్బెల్ట్ ఏరియాలో పట్టు సాధించాలనేది బీజేపీ నేతల అంతరంగంగా కనిపిస్తోంది. ఆ మేరకు కొందరు సింగరేణి యూనియన్ సంఘాల లీడర్లను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఇటీవల కిషన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు రామగుండంలో కేంద్ర మంత్రి సదానంద గౌడ పర్యటించినప్పుడు స్థానిక టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడం బీజేపీ స్ట్రాటజీలో భాగమని తెలుస్తోంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. ఆ మేరకు క్రమక్రమంగా ప్లాన్ వర్కవుట్ చేస్తుందనే వాదనలు లేకపోలేదు.