కాకి రెట్టంత కూడా చేయలే, గోబెల్స్ ప్రచారం: దుబ్బాక బై పోల్ క్యాంపెయిన్లో హరీశ్ రావు..
దుబ్బాక ఉప పోరు రంజుమీదుంది. ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం కొనసాగుతోంది. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు.. ఉప ఎన్నిక ప్రచారం పర్వంలో దూసుకెళ్తున్నారు. బీజేపీ- కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కానీ అదీ చేశాం, ఇదీ చేశాం అని గొప్పలు చెబుతుందని మండిపడ్డారు.
కాకి రెట్టంత కూడా..
దుబ్బాక నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ చాలా చేశారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దివంగత సోలిపేట రామలింగారెడ్డి ఏదీ అడిగితే అదీ ఇచ్చామని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ఏం చేసిందని అడిగారు. కాకి రెట్టంత కూడా మేలు చేయలేదని ధ్వజమెత్తారు. కానీ బీజేపీ గోబెల్స్ మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తున్నందుకు బీజేపీకి అవార్డు ఇవ్వొచ్చు అని చెప్పారు.
హరీశ్ రావు సమక్షంలో..
బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా కౌన్సిల్ సభ్యుడు ఎల్లయ్యతో పాటు దాదాపు 150 మంది మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక వస్తే మైకులు కూడా ఫెయిల్ అయ్యాయని హరీశ్ రావు విమర్శించారు.
త్యాగాల పునాదుల మీద
ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని హరీశ్ రావు తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిదని విమర్శించారు. ఇప్పుడెమో నీతి సూక్తులు చెబుతున్నారని దుయ్యబట్టారు. త్యాగాల పునాదుల మీద టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీది మాత్రం మోసాల చరిత్ర అని విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీపడతాయని అన్నారు.