సింగరేణి టీఆర్ఎస్ ఇన్కమ్ సోర్స్: కేసీఆర్, కవిత కోట్ల అక్రమాలంటూ తరుణ్, బండి సంజయ్ ఫైర్
ఆదిలాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్. సింగరేణిలో జరుగుతున్న కోట్లాది రూపాయల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఆయన అక్కడి కార్మికులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
సింగరేణిలో కవిత అక్రమాలు.. సీబీఐ విచారణ
కోట్ల రూపాయల ఆదాయం గల సింగరేణిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని తరుణ్ చుగ్ ఆరోపించారు. సింగరేణిలో పెత్తనం చెలాయిస్తూ అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు.
సింగరేణిపై కవిత ఆధిపత్యం..
సింగరేణికి కవిత యూనియన్ లీగర్గా మారి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. కార్మికులు, కార్మిక నేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి అవినీతికి అడ్డాగా మారిందన్నారు. సింగరేణిలో అవినీతిని చూస్తూ ఊరుకోమని అన్నారు. సింగరేణి సీఎండీ సరిగా పనిచేయడం లేదని, టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తున్నారని విమర్శించారు.
సింగరేణినే టీఆర్ఎస్ ఇన్కమ్ సోర్స్.. కేసీఆర్ అక్రమాలు
బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు ఫైనాన్స్ సోర్స్గా సింగరేణి మారిందన్నారు. సింగరేణి సొమ్మును కేసిఆర్ అక్రమంగా వాడుకుంటున్నాడన్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ అవినీతి మీద విచారణ జరపించి జైలుకు పంపిస్తామన్నారు హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ సింగరేణి సంస్థను దోచుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ మీటింగులకు, కేసీఆర్ మందుకు, సోడా, చికెన్ స్టఫ్కు కూడా సింగరేణి పైసలే పెడుతున్నారని ఆరోపించారు.
సింగరేణి సీఎండీ.. కేసీఆర్ చెప్పుచేతుల్లో పనిచేస్తున్నాడని, ఐఏఎస్ కాదు అయ్యా ఎస్ అంటున్నారన్నారు. సింగరేణిలో దోచుకున్న సొమ్మును కక్కిస్తామని... వచ్చే ఎన్నికల్లో సింగరేణి గడ్డపై కాషాయ జెండా ఎగురేస్తామన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.
బీజేపీలోకి హరీష్ బాబు
కాగా, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి తరుణ్ చుగ్ పర్యటిస్తున్నారు. కుమురంభీమ్ జిల్లా కాగజ్నగర్లో ఈరోజు నిర్వహించిన ఛత్రపతి శివాజీ సంకల్ప సభకు వీరిద్దరూ హాజరయ్యారు. సిర్పరూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జీ పాల్వాయి హరీష్ బాబు వీరి సమక్షంలో బీజేపీలో చేరారు. బండి సంజయ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరీష్ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హరీష్ బాబుతోపాటు ఆయన అనుచరులు బీజేపీలో చేరారు.