బీజేపీ జన్ సంవద్ ర్యాలీ.!మోదీ విజయాలను చాటి చెప్పడమే లక్ష్యం అంటున్న బండి సంజయ్.!
హైదరాబాద్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ మరో ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దేశం మొత్తం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో ఆ పార్టీకి మరింత ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే లక్ష్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అందుకోసం నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్బాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణ బీజేపిని బలోపేతం చేసే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు ఆక్సీజన్ లా పనిచేస్తాయని రాష్ట్ర బీజేపి విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ జన్ సంవద్ ర్యాలీలో పాల్గొనండి.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తెలంగాణ బీజేపి ఛీఫ్..
అందులో భాగంగా ప్రధానిగా నరేంద్ర మోదీ సంవత్సర కాలంలో అందుకున్న విజయాలను ఏకరువు పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో జన్ సంవద్ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ శ్రణులందరూ కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూనే ర్యాలీలో పాల్గొనాలని సంజయ్ కుమార్ పిలుపునిస్తున్నారు. తెలంగాణ బీజేపి అగ్రనేతలందరూ పాల్గొనే ఈ వర్చువల్ ర్యాలీని విజయవంతం చేయాలని సంజయ్ కుమార్ తెలిపారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విజయాలు.. మోదీని ప్రశంసించిన బండి సంజయ్..
అంతే కాకుండా దేశంలో ప్రజల ఆశీర్వాదంతో, అద్వితీయ మెజారిటీతో కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులకు తెలంగాణ ప్రజలకు జాతీయ నాయకత్వం నివేదిక ఇవ్వనున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు జరగనున్న ర్యాలీని తెలంగాణలోని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ర్యాలీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యమన్న సంజయ్..
తెలంగాణ జన్ సంవద్ ర్యాలీ పేరిట నిర్వహించే కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికల ద్వారా వీక్షించాలని సూచించారు. బీజేపీ తెలంగాణ సామాజిక మాధ్యమాల ద్వారా ద్వారా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా అందించే సందేశం వినాలని పిలుపునిచ్చారు. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా భావాల్ని పంచుకోవాల్సిన అవసరముందని తెలిపారు. ఏడాది పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కరోనా పరిస్థితుల్లో తీసుకున్న చర్యలపై జేపీ నడ్డా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని బండ సంజయ్ తెలిపారు.
Recommended Video
జాతీయ అద్యక్షుడు జేపి నడ్డా సందేశం.. అందరూ ఆన్ లైన్ లో వినాలని సూచించిన బండి సంజయ్..
తెలంగాణ బీజేపి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర్చువల్ ర్యాలీకి సంబంధించి వారం రోజులుగా శ్రేణుల్ని సన్నద్ధం చేసినట్టు బండి సంజయ్ కుమార్ తెలిపారు. టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమాచారం చేరవేసినట్టు చెప్పారు. వర్చువల్ ర్యాలీపై గ్రామగ్రామాన అవగాహన కలిగించేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీ నుంచి జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి, రాష్ట్ర కార్యాలయం నుంచి బండి సంజయ్ కుమార్ వర్చువల్ ర్యాలీలో పాల్గొంటున్నట్టు వివరించారు. శనివారం జరగనున్న వర్చువల్ ర్యాలీని పార్టీ శ్రేణులు, యువత ప్రజలకు చేరువ చేయాలని బండి సంజయ్ సూచించారు.