'టీఆర్ఎస్ కుట్ర?.. ప్రభుత్వ మోసాలన్ని ఆ నివేదికలో ఉన్నాయి'
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నట్టు.. రాష్ట్రం మిగులు బడ్జెట్ లో లేదని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదని కాగ్ రిపోర్ట్ కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలకు ఇప్పుడిదో అస్త్రంలా మారింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కుట్ర చేశారు
కాగ్ నివేదికతో టీఆర్ఎస్ సర్కార్ డొల్లతనం బయటపడిందని లక్ష్మణ్ విమర్శించారు. ఓవైపు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని కాగ్ నివేదిక చెబుతుంటే.. కాదు, ధనిక రాష్ట్రమని ఆర్భాటపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగ్ నివేదికను చివరి నిమిషంలో అసెంబ్లీలో బయటపెట్టి సభలో చర్చకు రాకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు.
టీఆర్ఎస్ మోసాలన్ని అందులో..
కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని, కానీ ఆ నివేదికను కచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఉన్నదంతా పంచితే.. పంచె కూడా ఊడిపోతుందని చెబితే మమ్మల్నే అపహాస్యం చేశారని అన్నారు. చివరకు కాగ్ నివేదికలో అదే తేలిందని, టీఆర్ఎస్ మోసాలన్ని అందులో ఉన్నాయని అన్నారు.
గొప్పలకు పోయి అప్పులు..
అప్పులు తీసుకొచ్చి మరీ రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉందని లెక్కలేయడమే ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. గొప్పలకు పోయి అప్పులు తెచ్చి.. వాటినే ఆస్తులుగా చూపిస్తూ, పైగా అప్పులు చేయని రాష్ట్రమే లేదంటూ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతసేపూ ఓట్లు రాబట్టే ప్రయత్నమే తప్ప.. అభివృద్ధి, సంక్షేమం అనే విషయాలను పట్టించుకోలేదన్నారు.
డబుల్ బెడ్ రూమ్ సంగతేంటి?
ఎన్నికల సమయంలో లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ప్రచారం చేసిన కేసీఆర్.. ఈ నాలుగేళ్లలో వెయ్యి ఇళ్లు కూడా పూర్తి చేయలేదని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిషన్ కాకతీయల పనులన్ని నత్త నడకన సాగుతున్నాయని ఆరోపించారు. సకాలంలో రుణాలు అందక 15లక్షల మంది రైతులు నష్టపోయారని అన్నారు.
అది కూడా అబద్దమే
కేసీఆర్ కిట్ వచ్చాక ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని చెప్పడం కూడా పచ్చి అబద్దమని కాగ్ నివేదికలో వెల్లడైన విషయాన్ని గుర్తుచేశారు. స్కూల్ డ్రాపౌట్స్ పెరుగుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు.
కర్ణాటకలోనూ బీజేపీదే గెలుపు..:
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీలను ఇంతవరకు భర్తీ చేయలేదని అన్నారు. టెంట్లు లేవు, ఫ్రంట్లు లేవని.. ఓడిపోయే పార్టీలన్ని గుంపుగా మారుతున్నాయని ఎద్దేవా చేశారు. త్రిపుర, గుజరాత్ లలో బీజేపీ గెలవదన్నారని, కానీ అధికారం కమలం పార్టీకే దక్కిందని గుర్తుచేశారు. అలాగే వచ్చే కర్ణాటక ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.