యూరియ కొరతపై కేంద్రం వర్సెస్ రాష్ట్రం : కేసీఆర్ సర్కార్ ఆరోపణలపై లక్ష్మణ్ ఫైర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సర్కార్ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. యూరియ కొరత లేదని .. కావాలనే కేంద్రాన్ని వేలి ఎత్తి చూపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అవసరానికి మించి యూరియా అందించిందన్నారు. కానీ లేని పోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా పుంజుకుంటుందని .. ఓర్వలేకే ఇలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడతో లక్ష్మణ్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సీజన్కు సరిపడ యూరియా ఇచ్చిన అనవసర ఆరోపణలు చేస్తుందని వివరించారు. దీనికి కారణం యూరియ స్టోరేజీ చేసుకోవడానికి సరిపడ గోదాములు లేవని .. అందుకే సమస్య తలెత్తిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కేంద్రవర్గాలు పేర్కొన్న విషయాన్ని లక్ష్మణ్ నొక్కి వక్కానించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. రాష్ట్రంలో వివిధ సమస్యలు ఉన్నా .. సీఎం కేసీఆర్ మాత్రం ఫాం హౌస్కు పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు.