హైకోర్టు రాజకీయం: 'కేసీఆర్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. అమరావతిలో'
హైదరాబాద్: హైకోర్టు విభజన ఆలస్యంపై కేంద్రాన్ని నిందించడం తగదని టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హైకోర్టు విభజన అంశంపై గురువారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆయన విమర్శించారు.
ఉమ్మడి హైకోర్టు విభజన అనేది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోని పరిష్కరించుకోవాల్సిన అంశమని అన్నారు. అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ఆయన సూచించారు. హైకోర్టు విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేయాల్సింది ఢిల్లీ కాదని, అమరావతిలో అని ఎద్దేవా చేశార
అమరావతి ప్రారంభోత్సవానికి కేసీఆర్, కేసీఆర్ తన ఫాంహౌస్లో నిర్వహించిన చండీయాగానికి చంద్రబాబు వెళ్లారు కాదా... అప్పుడు హైకోర్టు విభజనపై ఎందుకు మాట్లాడుకోలేదని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై రెండు ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నాటకాలాడుతున్నాయని అన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం రూ. 100 కోట్లు కేటాయించిన విషయాన్ని లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి అంశాన్నీ సెంటిమెంట్ పేరుతో రాజకీయ చేసే పరిస్థితి మానుకోవాలని అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.
న్యాయవాదుల దీక్షపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన లక్ష్మణ్, తమ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని అన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన అంశంపై గవర్నర్ నరసింహాన్ జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారాన్ని, ఆప్షన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు.