తెలుగు సీఎంలకు కుమారస్వామి ఝలక్!: బీజేపీ సూటి ప్రశ్న, 'కాంగ్రెస్ కోసం బాబు ప్రయత్నాలు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి, పోరాడిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, కానీ ఇప్పుడు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేస్తున్నారని బీజేపీ నేత మురళీధర రావు అభిప్రాయపడ్డారు. దక్షిణాన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే పోటీ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిన తమ సత్తా చాటుతామన్నారు.
మిషన్ 2019లో భాగంగా తమ తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఆయన చెప్పారు. దక్షిణ భారతంలో కాంగ్రెస్ ముక్త్ బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, టీడీపీలతో ఏదీ కాదన్నారు. కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తికాలం కొనసాగలేదన్నారు. బీజేపీ కీలక బాధ్యతలు తీసుకోవడమో లేదంటే మధ్యంతర ఎన్నికలు రావడమో జరుగుతుందని జోస్యం చెప్పారు.
కేసీఆర్, చంద్రబాబులు పిలుపునిచ్చినా బీజేపీపై తెలుగు ప్రజల విశ్వాసం
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు, టీఆర్ఎస్, టీడీపీలు పోటాపోటీగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రచారం చేసినా బీజేపీ, మోడీ పాలనపై కర్ణాటక ప్రజలు, అక్కడి తెలుగు ప్రజలు విశ్వాసం ఉంచారని మురళీధర రావు చెప్పారు. అందరూ ఒక్కటైనా మోడీకి ఆకర్షణ తగ్గలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ అవకాశవాద, మత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.
కుమారస్వామి వ్యాఖ్య: కేసీఆర్-చంద్రబాబులు ఇప్పుడు చెప్పాలి
తనకు కర్ణాటక ప్రజలు మెజార్టీ ఇవ్వలేదని, తాను కాంగ్రెస్ పుణ్యాన సీఎంను అయ్యానని కుమారస్వామి చెప్పారని, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని చెప్పిన ఆయనకు కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ అంటున్న కేసీఆర్, కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై స్థాపించబడిన టీడీపీ అధినేత చంద్రబాబులు వ్యతిరేకమా, అనుకూలమా సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఒక్కటి కావాలని కేసీఆర్, చంద్రబాబు పిలుపునిస్తున్నారు. కానీ కుమారస్వామి మాత్రం కాంగ్రెస్కు రుణపడి ఉంటానని చెప్పడంతో బీజేపీ ప్రశ్నిస్తోంది.
కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు మురళీధర రావు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని రాహుల్ గాంధీ అపహరించారన్నారు. జేడీఎస్ సీట్లు 40 నుంచి 37కు పడిపోయాయని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటున్నారని చెప్పారు.
ఆ శక్తి బీజేపీకి మాత్రమే ఉంది
ఎన్ని దశలు మారినా చంద్రబాబు మోస చరిత్ర మారదని మురళీధర రావు విమర్శించారు. తెలంగాణ, ఏపీలో ప్రజలకు అనుకూలంగా పాలన నడిపించే శక్తి బీజేపీకి, మోడీకి మాత్రమే ఉందన్నారు. వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమరశంఖం పూరిస్తూ 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మజ్లిస్కు కొమ్ముకాస్తూ రూ.40కోట్ల నిధులు కేటాయించిన టీఆర్ఎస్ మతవిద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. రైతుబంధు పథకం భూస్వామి బంధుగా మారిందన్నారు.