'కేసీఆర్ వచ్చాకే, పెద్దల హస్తం': మియాపూర్ భూస్కాంలో సంచలనం
మియాపూర్ భూకుంభకోణం కేసులో బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కుంభకోణానికి బీజం పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణం కేసులో బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కుంభకోణానికి బీజం పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇంతపెద్ద అక్రమం కేవలం సబ్రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో అయ్యే పనికాదని, పెద్దల హస్తం లేనిదే ఇంత తతాంగం జరగదని నాగం తేల్చి చెప్పారు. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని లేదంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.
కాగా, మియాపూర్ భూకంభకోణం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
మియాపూర్ భూకుంభకోణంపై అధికారులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో బాగంగా బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసఫ్ అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాలానగర్ సబ్ రిజిస్ర్టార్ మహ్మద్ యూసఫ్ అలీ రిజిస్ర్టేషన్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు.
మదీనాగూడలోని సర్వే నంబర్ 162, 163లో బీహెచ్ ఈఎల్ ఎగ్జిక్యూటివ్ హౌసింగ్ సొసైటీ, మానస బీహెచ్ ఈఎల్ ఎగ్జిక్యూటివ్ టవర్స్ను నిర్మించింది.
సహకార సొసైటీలకు మాత్రమే జీవో నంబర్ 472 ద్వారా స్టాంప్ డ్యూటీకి మినహాయింపు వర్తిస్తుంది. ఎగ్జిక్యూటివ్ సొసైటీలకు ఉండదు. అయినా స్టాంప్ డ్యూటీ మినహాయింపు వర్తింపజేశారు. రూ.1.50 కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది.