లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన రఘునందన్ రావు
హైదరాబాద్: తనపై ఓ మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ కీలక నేత రఘునందన్ రావు స్పందించారు. బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు..
ఈ నేపథ్యంలో సదరు మహిళ చేస్తున్న ఆరోపణలు నూటికి నూరు శాతం అవాస్తవమని ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తనకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. తాను ఏ నేరం చేయలేదని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలియదని చెప్పారు. పూర్తి వివరాలు తెసుకున్నాక దీనిపై స్పందిస్తానని రఘునందన్ రావు తెలిపారు.
కాఫీ మత్తుమందు కలిపి..
కాగా, రఘునందన్ రావు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సోమవారం రాధారమణి అనే మహిళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ఫిర్యాదు చేసింది.
2007లో రఘునందన్ రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక, తనకు అతని నుంచి ప్రాణహాని కూడా ఉందని అన్నారు.
అశ్లీల ఫొటోలతో బెదిరింపులు..
ఇంకా ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఆర్సీపురంలో రాధారమణి దంపతులు ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్తతో విభేదాలు రావడంతో 2003లో ఇంటినుంచి బయటకొచ్చారు. అయితే భృతి ఇప్పించేందుకు 2007లో స్థానిక అడ్వకేట్ రఘునందన్ను ఆశ్రయించారు. అలా ఓ సారి ఆఫీసుకు వెళ్లిన రాధారమణికి కాఫీలో మత్తుమందు కలిపి లైంగికదాడి చేశారని ఆరోపించారు. అంతేకాదు ఆశ్లీల ఫోటోలు ఉన్నాయని చెప్పి.. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని రాధారమణి చెప్పారు. అలా చెప్పినట్టు చేసుకుంటూ వచ్చానని పేర్కొంది.
పోలీసులకు ఫిర్యాదు..
వేధింపులు తాళలేక మానవ హక్కుల కమిషన్ను సంప్రదించానని తెలిపింది. వారి సూచన మేరకు ఆర్సీ పురం పీఎస్లో ఫిర్యాదు చేశానని వివరించారు. తాజాగా కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను బెదిరిస్తున్నారని రాధారమణి తెలిపింది. తనను రఘునందన్ కిడ్నాప్ కూడా చేశాడని, ఇందుకు తన భర్త కూడా సహకరిచాడని ఆరోపించింది. సదరు మహిళ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.