అయోధ్య తీర్పుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓవైసీ పై కేసు నమోదు చేయాలి: సుభాష్
హైదరాబాదు: అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారని, తీర్పుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు బీజేపీ నేత ఎన్వీ సుభాష్. ఓవైసీ తన సొంత అజెండాతోనే ఈ వ్యాఖ్యలు చేశారని తద్వారా భారత సమగ్రతను దెబ్బతీయాలని భావించారని సుభాష్ ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు అయోధ్య విషయంతో తీర్పు ఇచ్చాక కూడా ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్న సుభాష్, దేశంలో మళ్లీ మతకల్లోలాలు జరిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తీర్పును స్వాగతించాల్సింది పోయి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఓవైసీ చేయడంపై సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు సుభాష్. కొన్ని శతాబ్దాలుగా పరిష్కారం లేకుండా ఉన్న అయోధ్య సమస్యకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో పరిష్కారం చూపిందని కొనియాడారు సుభాష్. ఇక కేసులో వాదనలు విన్న ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిందని సుభాష్ గుర్తుచేశారు. ఇలాంటి తీర్పు ఇచ్చిందంటే మొత్తం సమాజంకు ఇది ఆమోదయోగ్యంగానే పరిగణించాలని అన్నారు. అంతేకాదు భారత్లో ప్రతి ఒక్కరూ ముస్లిం సంఘాలతో సహా తీర్పును స్వాగతించాయని సుభాష్ గుర్తు చేశారు. కానీ ఓవైసీ మాత్రం సొంత అజెండాతో ముందుకెళుతూ సొంత వర్గాన్నే అవమానపరుస్తున్నాడని సుభాష్ నిప్పులు చెరిగారు.
దేశ ప్రయోజనాలను పరిరక్షించకుండా ఉండేందుకు మరో వేదికను అసదుద్దీన్ తయారు చేస్తున్నారని మండిపడ్డారు సుభాష్. ఒక ఎంపీగా రాజ్యాంగంను దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుతానని ప్రమాణస్వీకారం చేసిన అసదుద్దీన్... దానంగా ఇచ్చే భూమి తమకెందుకుంటూ ప్రశ్నిస్తూ సొంత వర్గాన్ని అవమానించారని అన్నారు సుభాష్. వెంటనే పోలీసులు ఓవైసీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చారిటీ కింద వచ్చిన చాలా భూమిని అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాదులో తీసుకున్నారని... మరి ఈ భూమిని ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడే ఓవైసీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నట్లు అర్థం అవుతోందని సుభాష్ విమర్శించారు.
ఓవైసీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి చారిటీ కింద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా భూమిని తీసుకున్నారని సుభాష్ ఆరోపించారు. ఓవైసీ నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, హాస్పిటల్స్ అన్ని ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమిలో కట్టినవే అని ఆరోపించారు. భూముల ధర చాలా ఎక్కువగా ఉండగా.. చాలా తక్కువ ధరకే భూములను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారని ఫైర్ అయ్యారు సుభాష్.