కేసీఆర్కు దడ పుట్టింది.. అందుకే ఉద్యోగాల భర్తీ గుర్తొచ్చింది.. రాములమ్మ విజయశాంతి ఫైర్
సీఎం కేసీఆర్పై పైర్ బ్రాండ్ విజయశాంతి నిప్పులు చెరిగారు. కేసీఆర్కు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పుడు గుర్తొచ్చాయా అని అడిగారు. రెండు ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వస్తే తప్ప చలనం రాలేదా అని విరుచుకుపడ్డారు. అప్పుడెప్పుడో ఉద్యమ సమయంలో వినిపించిన నీళ్లు, నియామకాలు, నిధులు... ఇప్పుడు గుర్తొచ్చాయా అని అడిగారు. ఎన్నికల్లో ఓడిపోతే తప్ప ప్రజల బాధ పట్టదా అని అడిగారు.
ఓడిపోతే.. గుర్తొచ్చాచారా..?
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్కు దడ పుట్టిందని విజయశాంతి ఆరోపించారు. అందుకే ఇప్పుడు ఉద్యోగాల ప్రస్తావన తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్కు ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారు అని విజయశాంతి గుర్తుచేశారు. మరీ గత ఆరేళ్ల నుంచి వారి బాధలను ఎందుకు పట్టించుకోలే అని అడిగారు. కరోనా సమయంలో కూడా పట్టించుకున్న నాథుడే లేడు.. కానీ ఓటమితో ఒక్కొక్కరు గుర్తుకు వస్తున్నారు అని మండిపడ్డారు.
50 వేల ఉద్యోగాల భర్తీ..?
ఆదరా బాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టడంలో ఆంతర్యం అందరికీ తెలుసు అని చెప్పారు. ఉద్యోగాలు, నీళ్ళు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి మరచిపోయారని తెలిపారు. అధికారం చేపట్టగానే ఆ విషయం మరచిపోయారు కానీ బీజేపీ విజయం సాధించడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిందని పేర్కొన్నారు. అందుకోసమే నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారని తెలిపారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదన్నారు.
అన్యాయం జరిగే ఛాన్స్..?
రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందని విజయశాంతి చెప్పారు. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయని వివరించారు. ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదని నొక్కి వక్కానించారు. కానీ ఇందులో కూడా కేసీఆర్ తన స్వార్థం చూసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొద్దిరోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉందన్నారు. విజ్ఞులైన ఓటర్లు ఉద్యోగాల గురించి అడుగుతారని.. ఉద్యోగాల భర్తీ పేరుతో వంచనకు దిగారని ఆరోపించారు. కానీ కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.