బీజేపీ నేతల ఛలో సెక్రటేరియట్లో ఉద్రిక్తత: 'కేసీఆర్కు కార్మికుల ఉసురు తగులుతుంది'
హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు మద్దతుగా బీజేపీ తెలంగాణ నేతలు చేపట్టిన ఛలో సెక్రటేరియట్ ఉద్రక్తంగా మారింది. బీజేపీ తెలంగాణ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ల నేతృత్వంలోని పార్టీ నేతలు, పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో సచివాలయాన్ని ముట్టడించారు.
ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర స్ధాయిలో తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్ధితులు ఉద్రిక్తంగా మారాయి. వెంటనే పోలీసులు పలువురి బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అంతక ముందు విధుల నుంచి తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఇందిరా పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నాకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమ్మె చేశారని పారిశుద్ధ్య కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేసి రోడ్డున పడేయడం సీఎం కేసీఆర్కు న్యాయం కాదన్నారు.
చెత్తను ఊడ్చే కార్మికులు గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద జాడుకట్టతో జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఊడ్చేయాలని పిలుపునిచ్చారు. కొత్త ఉద్యోగాలు సంగతి దేవుడెరుగ ఉన్న ఉద్యోగాలను తీసెస్తున్నారని సీఎం కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు పారిశుద్ధ్య కార్మికులు ఉసురు తగులుతుందన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై పలుమార్లు సీఎం కేసీఆర్ను కలవాలని ప్రయత్నించానని, అయినా తమకు సమయం కేటాయించడంలేదని ఆరోపించారు.