బెడిసికొట్టిన యత్నాలు: నాగంతో బీజేపీ నేతల ‘రాజీ’ చర్చలు విఫలం
హైదరాబాద్: మాజీ మంత్రి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు నాగం జనార్దనరెడ్డి త్వరలో 'హస్తం' పార్టీ కాంగ్రెస్ చేయందుకునేందుకు నేపథ్యం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. 2014కు ముందు వరకు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన నాగం జనార్దన రెడ్డి గత లోక్ సభ ప్లస్ అసెంబ్లీ జమిలీ ఎన్నికల వేళ బీజేపీలో చేరి మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఇప్పటి వరకు కమలనాథుల పార్టీలో తెలంగాణలో ఆయనకు సరైన ప్రాధాన్యం లభించలేదని విమర్శలు వచ్చాయి. కొంతకాలం తర్వాత 'తెలంగాణ బచావో' అనే వేదికను ఏర్పాటు చేసిన నాగం జనార్దన రెడ్డి.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి తదితర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలపై న్యాయస్థానాల్లో ఎడతెగని పోరాటం చేస్తున్నా.. పార్టీ నుంచి మద్దతు లభించలేదన్న అభిప్రాయం ఉంది.
భవితవ్యంపైనే నాగం ఇలా ఫోకస్
తరాల అంతరమా? నాగం దూకుడు ముందు నిలవగలమా? అన్న సందేహామా అన్న సంగతి చెప్పలేం గానీ తెలంగాణలో బీజేపీ నేతల మధ్య సఖ్యత కుదరలేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల నాటికి తన రాజకీయ భవితవ్యం.. ప్రత్యేకించి తన కుమారుడి రాజకీయ భవితవ్యంపై ద్రుష్టి సారించారు నాగం జనార్దన రెడ్డి. ఈ నేపథ్యంలో వచ్చే ఉగాది తర్వాత తన రాజకీయ భవితవ్యంపై కీలకం నిర్ణయం తీసుకుంటానని ఇటీవలే చేసిన ప్రకటనతో అసలు సంగతి తేటతెల్లమైంది. నాగం బీజేపీని వీడటం ఖాయమని తేలిపోయింది.
బీజేపీలో సంతోషం లేదన్న నాగం
దీంతో సమయం మించి పోయిన తర్వాత బీజేపీ నాయకత్వం ఆయనకు నచ్చచెప్పేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కే లక్ష్మణ్ ఈ మేరకు కొందరు బీజేపీ సీనియర్ నేతలను నాగం జనార్దన రెడ్డి వద్దకు రాయబారం పంపారు. పార్టీలో నాగం జనార్దనరెడ్డికి తగిన గౌరవం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. బీజేపీలో సరిగ్గానే చూసుకుంటామని హామీ పంపారు. ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీలు గుప్పించారు. కానీ తనకు బీజేపీలో ఏ మాత్రం సంతోషం లేదని తన వద్దకు వచ్చిన బీజేపీ నేతలకు నాగం జనార్దనరెడ్డి తేల్చి చెప్పారని తెలుస్తున్నది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం గల తనకు బీజేపీ సామాన్య కార్యకర్త స్థాయి గౌరవం కూడా ఇవ్వడం లేదని నాగం ఆక్షేపించారు.
పెండ్లి పత్రికపై ‘తెలంగాణ’ అని ముద్రించుకున్న నాగం
‘ఎటువంటి పరిస్థితుల్లోనూ వచ్చే ఉగాది పండుగ వరకు నా భవిష్యత్ వ్యూహం బయటపెట్టకూడదని నిర్ణయించుకున్నా. సరైన సమయంలో నా నిర్ణయాన్ని బయటపెడతా' అని చెప్పారు. రమారమీ 40 ఏళ్ల రాజకీయ జీవిత నేపథ్యం గల నాగం జనార్దన రెడ్డి 1969లో తొలిదశ ‘తెలంగాణ ఉద్యమం'లోనూ పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ పరిధిలో వైద్యుడిగా తొలుత సేవలందించిన నాగం జనార్దనరెడ్డి తన పెండ్లి పత్రికలో ఘనంగా ‘జై తెలంగాణ' అని సగర్వంగా ముద్రించుకున్న నేపథ్యం కలిగి ఉన్నారు. తర్వాతీ కాలంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన నాగం జనార్దన రెడ్డి 1985లో తొలిసారి నాగర్ కర్నూల్ స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1995 నుంచి 2012 వరకు టీడీపీలో ఇలా కీలకం
1989 ఎన్నికలు మినహా 2014 వరకు ఓటమెరుగని రాజకీయ నేతగా ఎదిగారు. 2019 అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ప్రకటించిన నాగం జనార్దన రెడ్డి.. 1995లో నాటి అధికార టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో చంద్రబాబు పక్షాన నిలిచి, రాష్ట్ర, జిల్లా అధికార రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1995 నుంచి 2004 వరకు టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నాగం జనార్దన రెడ్డి.. 2004, 2009, 2012 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు విషయంలో ప్రస్తుతం టీఆర్ఎస్లో ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కీలకంగా వ్యవహరించారు.
ఇలా కీలక పాత్ర పోషించిన నాగం, ఎర్రబెల్లి
ప్రస్తుత తెలంగాణ సీఎం - టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మహబూబ్ నగర్ టిక్కెట్ కేటాయించడానికి చంద్రబాబును ఒప్పించడంలో ఎర్రబెల్లి, నాగం ముఖ్య పాత్ర పోషించారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు 2009 ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ స్థానం కేటాయించడంలోనూ ముఖ్య భూమిక పోషించిన నాగం.. 2009 ఎన్నికలు.. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత నాటి టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు అనుసరించిన వైఖరి నాగం ఆలోచనలో మార్పు తీసుకొచ్చింది. ‘రెండు కళ్ల' సిద్ధాంతంతో ఏపీకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాగం జనార్దన రెడ్డి హైదరాబాద్ నగర పరిధిలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సాచివేత ధోరణితో ఢిల్లీలో ప్రస్తుత తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారితో కలిసి తెలంగాణకు అనుకూలంగా రోడ్డుబయట మీడియాతో సమావేశం నిర్వహించారు.
2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి ఇలా ఓటమి
తెలంగాణ నగారా అనే వేదిక పేరిట కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ స్థాయిలో అప్పటి గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు.. టీఆర్ఎస్ నాయకత్వం వైఖరి ఆయనను బీజేపీకి దగ్గర చేశాయి. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన ఎన్నికల వ్యూహం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు శరాఘాతంగా మారాయి. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు, బీజేపీ, టీడీపీ చెరో లోక్ సభ స్థానాలకు పరిమితం అయ్యాయి. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన నాగం జనార్దన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి మంత్రి జైపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ఎపీ జితేందర్ రెడ్డి మధ్య జరిగిన త్రిముఖ పోటీలో జితేందర్ రెడ్డి విజయం సాధించారు.
తెరాస ప్రభుత్వ పనితీరుపై నాగం ఇలా న్యాయ పోరాటం
దీంతో నాగం జనార్దనరెడ్డి 2014 ఎన్నికల తర్వాత కొద్దికాలం బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నా తర్వాత ప్రాధాన్యం లభించకపోవడంతో వ్యూహాత్మక మౌనం వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలను సవాల్ చేస్తూ న్యాయస్థానాల్లో పోరాటం చేశారు. అదే క్రమంలో ఆయన తరఫున న్యాయస్థానంలో వాదించిన న్యాయవాది ఒకరు రాయలసీమ కావడంతో అధికార టీఆర్ఎస్ ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి మరీ ఆయనపై వ్యతిరేకత రంగరించేందుకు విఫల ప్రయత్నాలు చేసిందన్న విమర్శలు ఉన్నాయి.