తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫైట్.. సెంట్రల్ ఈసీకి ఫిర్యాదు
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగలేదని మండిపడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. గురువారం కేంద్రం ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని అందులో ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతవడంలో ఈసీ ప్రమేయం ఉందని ఆరోపించారు.
బీజేపీకి బలమున్న చోట ఓటర్ల సంఖ్య తగ్గిందని.. అదే మజ్లిస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా కూడా పలు అనుమానాలకు తావిస్తోందని సెంట్రల్ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. ఓటర్ల తొలగింపులో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి క్షమాపణలు కూడా కోరడం అక్రమాలు జరిగాయనడానికి నిదర్శనమని తెలిపారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్ తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని తెలిపారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.
ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు ఓటర్లను తొలగించే అంశంలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉందని వ్యాఖ్యానించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. టెక్నికల్ గా దొర్లే లోటుపాట్లు సరిచేయాలన్నది తమ అభిమతమని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడినట్లుగా తాము మాటలు మార్చబోమని చెప్పారు. ఫలితాలు అనుకూలంగా వస్తే ఒకలా మాట్లాడటం.. వ్యతిరేకంగా వస్తే మరోలా మాట్లాడటం ఆ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.