'కేసీఆర్! బహిరంగంగా మజ్లిస్తో పొత్తు కుదుర్చుకోగలవా? అప్రజాస్వామికం'
హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేయడంపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు అని అమలు కానీ హామీలతో మోసం చేశారని, దీనికి తెరాసను ఓడించాలని కిషన్ రెడ్డి అన్నారు.
మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారన్నారు. మజ్లిస్ పార్టీకి చెందిన ప్రయివేటు వైద్య కళాశాలకు భూమి ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు. మజ్లిస్ పార్టీ మీకు మిత్రపక్షమైతే బహిరంగ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని సవాల్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకు వస్తోందన్నారు.
కొత్త ట్విస్ట్, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా: రాష్ట్రపతి పాలనకు డిమాండ్?
అసెంబ్లీని రద్దు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. అయిదేళ్లు పాలించాలని ప్రజలు తీర్పు ఇస్తే నాలుగేళ్లకే ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు.
కేబినెట్ అభిప్రాయాలను కూడా కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ పూర్తి చేయలేదన్నారు. మిషన్ భగీరథ పూర్తి చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పారని గుర్తు చేశారు.