తెలంగాణలో మాదే కింగ్ రోల్.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర.. బీజేపీ నేతల అంతరంగమేంటో?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయి? అటు కారుకే మళ్లీ అధికారమా.. లేదంటే మహాకూటమికే పీఠమా? ఇలాంటి ప్రశ్నలతో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తో పాటు వివిధ విశ్లేషణలతో ఎవరికి అధికారమన్నది తేల్చుకోలేకపోతున్న సమయంలో ఆయన మాట్లాడిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ ప్రమేయం లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదన్న లక్ష్మణ్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? మాకు సీట్లు పెరగడమే కాదు ఓట్ల శాతం కూడా అనూహ్యంగా పెరుగుతుందని చెప్పడం వెనుక ఆంతర్యమేంటి? కాంగ్రెస్, మజ్లిసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో చేరడానికి ఆలోచిస్తామని చెప్పడంలో మర్మమేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా టీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి ముందస్తు ఒప్పందం జరిగిందనే ప్రచారానికి తాజాగా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి.
కమలం సత్తా తెలుస్తుంది : లక్ష్మణ్
తెలంగాణలో బీజేపీ బలమేంటో, సత్తా ఏంటో ప్రత్యర్థి పార్టీలకు తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు లక్ష్మణ్. ఈసారి బీజేపీ సాయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కాంగ్రెస్, మజ్లిసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానితో జతకట్టే విషయంలో ఆలోచిస్తామన్నారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 60 స్థానాల్లో విజయలక్ష్యంతో ఎన్నికల్లో పోటీకి దిగామని.. తమ పార్టీకి ప్రస్తుతం ఉన్న సీట్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ఓట్ల శాతం కూడా అనూహ్యంగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
సీట్లు పెరిగేనా..! ఓట్లు కలిసొచ్చేనా?
గతంలో చాలాసార్లు పొత్తులు పెట్టుకున్న బీజేపీ పదేళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. అయితే బీజేపీకి క్యాడరున్నా.. లీడర్లు లేరనే వాదన ఉంది. అందుకే తెలంగాణలో ఆ పార్టీకి అనుకున్నంత పట్టుదొరకడం లేదనేది మరో కోణం. అదలావుంటే 2014 ఎన్నికల్లో 5 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ సీట్లు పెరుగుతాయని చెప్పడం ఆసక్తి రేపుతోంది. అయితే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హవా ఆ పార్టీకి కొంచెం కలిసొచ్చిందని చెప్పొచ్చు.
మోడీ చరిష్మా.. కమలంపై ఆశలు
ఉమ్మడి రాష్ట్రమున్నప్పుడు 1999 సంవత్సరంలో టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీచేసిన బీజేపీ 12 సీట్లు కైవసం చేసుకుంది. 2009 లో ఒంటరిగా బరిలోకి దిగి కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2014లో తిరిగి పుంజుకుని 5 స్థానాల్లో కమలం జెండా ఎగురవేసింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు ప్రధాని మోడీ చరిష్మాతో కమలం వికసిస్తోందనే బలం చేకూరడంతో ఆ పార్టీ నేతలు ఈసారి గట్టి ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఓట్లశాతం, సీట్ల సంఖ్య పెరుగుతుందని లక్ష్మణ్ వ్యాఖ్యల మర్మంగా కనిపిస్తోంది.
అటు మజ్లిస్, ఇటు కారు.. పొత్తు కుదిరేనా?
ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి మాకు కూడా ఛాన్సుందని వ్యాఖ్యానించిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఇతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కీ రోల్ గా మారుతామని చెబుతున్నారు. ఒకవేళ ఫలితాలు అటు ఇటుగా వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీతో కలుస్తామన్న లక్ష్మణ్.. ఒక కొర్రీ పెట్టారు. పార్టీల బలబలాలు చూసి.. కాంగ్రెస్, మజ్లిస్ భాగస్వామ్యం లేని పార్టీతో జతకట్టే విషయం ఆలోచిస్తామని చెప్పారు. ఎంఐఎం పార్టీ బీజేపీకి బద్ధశత్రువని వ్యాఖ్యానించారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేయబోతే ఎంఐఎం తో ఆల్రెడీ పొత్తు వ్యవహారం నడిపిస్తున్న ఆపార్టీతో బీజేపీ జత కడుతుందా లేదా అన్నది చూడాలి. అయితే ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందనే ప్రచారం అందరికీ తెలిసిందే.